సిద్దిపేట జిల్లాలో కాకతీయ గణపతిదేవుని శిల్పం గుర్తింపు

posted on: May 25, 2026 10:45AM

మొత్తం తెలుగు నేలను సా.శ.1199 నుంచి సా.శ.1262 వరకు ఏకచత్రాధిపత్యంగా పాలించిన కాకతీయ గణపతిదేవుని శిల్పం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, చరిత్రకారుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్,  రామోజు హరగోపాల్ తెలిపారు.
 పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, అవశేషాలు పరిరక్షణ పై గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వారు సిద్దిపేట జిల్లా నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను ఆదివారం (మే 24)  సందర్శించారు. ఆ సందర్భంగా బెజ్జంకి మండలం తోటపల్లిలోని వారసత్వ తెలంగాణ శాఖ రక్షిత కట్టడమైన కాకతీయుల కాలపు శివాలయం రంగమండపంలోని ఒక శిల్పం ముమ్మాటికి కాకతీయ గణపతిదేవుడు, ఆయన భార్య సోమలదేవి,  రాచగురువు విశ్వేశ్వర శివాచార్యులదేనని శివనాగిరెడ్డి, హరగోపాల్ చెప్పారు.

రాచగురువు సమక్షంలో శివదీక్ష  తీసుకున్న గణపతిదేవుడు, రాచరికపు చిహ్నాలను పక్కన పెట్టి, తలపై శిఖ, వంటిపై రుద్రాక్షమాలలను ధరించి, శివలింగానికి పుష్పాభిషేకం చేస్తున్నట్లు, ద్రవిడ తమ్మిల్ల కేశాలంకారణతో నున్న సోమలదేవి కూడా పూజలో నిమగ్నమైనట్లు, చక్రవర్తికి కుడివైపున రాజగురువు గోళకి మఠాధిపతి విశ్వేశ్వర శివాచార్యుడు వారి చేత పూజలు చేస్తున్నట్లుగా నిలబడి ఉన్నాడని వారన్నారు.

 చక్రవర్తి, ఆయన భార్య, రాచ గురువుల తలలపైన రాజలాంఛనాలైన ఛత్రాలు ఉన్నాయని, ఎడమవైపున వింజామర వీస్తున్న పరిచారిక ఉన్న ఈ శిల్పం తోటపల్లి శివాలయం కాకతీయ వాస్తు శైలిలో  నిర్మించబడిందని, అందుచేత చక్రవర్తి గణపతిదేవుడు, సోమలదేవిగా గుర్తించినట్లు శివనాగిరెడ్డి, హరగోపాల్ చెప్పారు. 

 60 ఏళ్లకు పైగా పాలించిన కాకతీయ గణపతిదేవుని ఈ శిల్పం, తెలంగాణలో గుర్తించిన వాటిలో మొదటిదని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారసత్వ ప్రేమికుడు, లాంకో హిల్స్ ఎండి అండ్ సీఈవో, సింహాద్రి వెంకట్రామరెడ్డి, ఆలయ పూజారులు కైలాసపతి, కవిత, గ్రామస్తులు ముక్తా బీరయ్య, బిలమేని సంపతి, దయ్యాల ఐలేష్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేష్ పాల్గొన్నారని వారు చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...