ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ: మీరు అప్లై చేయవచ్చా? నిపుణుల రివ్యూ ఇదే!

posted on: Jul 15, 2026 12:00PM

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఓలలో ఒకటిగా నిలిచిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ పబ్లిక్ ఇష్యూ జూలై 14న పెట్టుబడిదారుల ముందుకు వచ్చింది. జూలై 16 వరకు కొనసాగే ఈ ఐపీఓ మొత్తం రూ. 9,795 కోట్ల భారీ విలువతో మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) అయిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి వస్తున్న ఈ ఇష్యూపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా ఎస్‌బీఐ మరియు అముండి సంస్థలు తమకున్న వాటాలను విక్రయిస్తున్నాయి.

ఈ ఐపీఓ కోసం కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 545 నుండి రూ. 574గా నిర్ణయించింది. సాధారణ ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్ల లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 14న ప్రారంభమైన ఈ ఇష్యూ మొదటి రోజు దాటి రెండో రోజు నాటికి 68 శాతం మేర సబ్‌స్క్రిప్షన్ సాధించింది. ప్రత్యేకించి నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII) విభాగంలో అత్యధికంగా 1.39 రెట్లు స్పందన లభించగా, ఉద్యోగుల కోటా 1.02 రెట్లు, షేర్‌హోల్డర్ల కోటా 1.04 రెట్ల మేర బుక్ అయింది. అదేవిధంగా రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం కూడా 62 శాతం సబ్‌స్క్రిప్షన్‌తో దూసుకుపోతోంది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో ప్రస్తుతం 8 శాతం బిడ్లు దాఖలయ్యాయి.

పబ్లిక్ ఇష్యూ కంటే ముందే ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఏకంగా రూ. 2,663 కోట్ల భారీ నిధులను సేకరించి తన బలాన్ని నిరూపించుకుంది. ఇందులో గ్లోబల్ దిగ్గజాలైన జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు, దేశీయ రంగానికి చెందిన ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి ప్రముఖ సంస్థలు 129 మంది యాంకర్ ఇన్వెస్టర్లుగా పాల్గొని షేర్లను దక్కించుకున్నాయి. కంపెనీ తన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ. 54 ప్రత్యేక తగ్గింపును అందిస్తుండటం విశేషం.

మార్కెట్ వాటా పరంగా చూస్తే, ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ మార్చి 31, 2026 నాటికి రూ. 12.51 లక్షల కోట్ల త్రైమాసిక సగటు నిర్వహణ ఆస్తులతో (QAAUM) దేశంలోనే 15.3 శాతం మార్కెట్ వాటాను కలిగి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తం అన్ని రకాల పోర్ట్‌ఫోలియో సేవలతో కలిపి కంపెనీ నిర్వహణ ఆస్తుల విలువ రూ. 29.46 లక్షల కోట్లకు చేరింది. గ్రే మార్కెట్‌లో ఈ షేరు ప్రస్తుతం రూ. 88 ల ప్రీమియం (GMP) వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ప్రీమియం ప్రకారం షేరు దాదాపు రూ. 662 వద్ద అంటే 15.33 శాతం లాభంతో మార్కెట్లలో లిస్ట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

sbi mutual fund ipo subscription review,sbi funds ipo price band listing date.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...