లక్నో విమానాశ్రయంలో సౌదీ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
posted on Jun 16, 2025 10:20AM

విమానాలలో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరువక ముందే.. సాంకేతిక లోపాల కారణంగా విమానాల ఎమర్జెన్సీ ల్యాండిగ్, వెనక్కు మళ్లింపు, ల్యాండిగ్ సమయంలో రన్ వే పై నుంచి జారి పక్కకు దూసుకుపోవడం, బాంబు బెదరింపు కారణంగా విమానం నిలిపివేత వంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటం ఆందోళనకు కారణమౌతోంది.
తాజాగా సోమవారం (జూన్ 16) సౌదీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తతెల్తడంతో ఆ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానం ల్యాండింగ్ గేర్లో సాంకేతిక లోపం తలెత్తడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. విమానం చక్రం నుంచి పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 250 మంది ప్రయాణీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు హజ్ యాత్రికులేనని చెబుతున్నారు. పైలట్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.