దేవాలయ ప్రాంగణంలో సాధువు గంజాయి సాగు
posted on: Jan 30, 2026 8:15PM

భక్తి బోధనలు చేస్తూ, గుడిలో పూజలు నిర్వ హిస్తూ గ్రామ ప్రజలకు గురువుగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి అసలు రూపం బయటపడింది. సాధువు ముసుగులో గంజాయి సాగు, అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచాగామ్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. డీటీఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో దేవాలయ ప్రాంగణంలోనే భారీగా గంజాయి మొక్కలు, ఎండబెట్టిన గంజాయి, విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
పంచాగామ్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 685 గంజాయి మొక్కలు, 17.741 కేజీల గంజాయి, 0.897 కేజీల గంజాయి విత్తనాలు, అలాగే రూ.30 వేల నగదు, గంజాయి తూకం వేసేందుకు ఉపయోగించిన వెయింగ్ మెషిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువను అధికారులు సుమారు రూ.70 లక్షలుగా అంచనా వేశారు. నిందితుడు గ్రామం లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలకు “అవుంటి నర్సయ్య మహారాజ్”గా ప్రసిద్ధి చెందాడు.
గుడికి వచ్చే భక్తు లకు మంచి మాటలు చెప్ప డం, భక్తి మార్గాన్ని బోధించ డం ద్వారా గురువుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అదే గుడి ప్రాంగణం లో పూజల కోసం పూలు పెంచాల్సిన బంతిపూల తోటలో గంజాయి మొక్క లను సాగు చేస్తూ అక్రమ ఆదాయాన్ని సంపాదిస్తున్న విషయం బయటపడటం సంచలనంగా మారింది. పోలీసు విచారణలో నిందితుడు చాలా కాలంగా గంజాయి సాగు చేస్తూ, ప్యాకెట్లుగా తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.
పంచాగామ్ గ్రామంలోనే కాకుండా సమీప గ్రామాల్లో కూడా గంజాయి సాగు సాధార ణంగా జరుగుతోందని, గతంలో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలకు వెళ్లిన సందర్భాల్లో దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.పంచాగామ్ గ్రామంలో గంజాయి సాగు జరుగుతోందన్న పక్కా సమాచారంతో డీటీఎఫ్ సీఐ దుబ్బాక శంకర్, ఎస్సైలు హన్మంత్, అనుదీప్, అలాగే సిబ్బంది అంజిరెడ్డి, అరుణ జ్యోతి, శివకృష్ణ, రాజేష్ కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ఉన్న బంతిపూల తోటలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
వ్యక్తిగత నేపథ్యం
గురువుగా చెలామణి అవుతున్న నర్సయ్య మహారాజ్ భార్య మృతి చెందగా, తన ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసినట్టు సమాచారం. అనంతరం కొంతకాలం ఆశ్రమంలో ఉండి తిరిగి గ్రామానికి వచ్చి గుడి పూజారిగా అవతారం ఎత్తాడు. భక్తి పేరుతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి, అదే విశ్వాసాన్ని అడ్డుగా పెట్టుకుని అక్రమ వ్యాపా రానికి పాల్పడటం గ్రామస్తులను విస్మయానికి గురిచేసింది.
ఈ ఘటనలో నిందితుడిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు, గంజాయి, విత్తనాలతో పాటు నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పంచాగామ్ గ్రామం స్థానిక ఎమ్మెల్యే స్వంత గ్రామం కావడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రామంలో గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.


.webp)



