అంపశయ్యపై మానవ తొలిజాతి..!

posted on: May 31, 2016 3:17PM

ఏటా కొన్ని లక్షల జీవరాశులు అంతరించిపోతున్నాయని ప్రతి రోజూ మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. ఈ జాబితాలోకి మానవుడు వచ్చి చేరాడు. ఎంటి జోక్ చేస్తున్నారా..? భూమి మీద ఇన్ని కోట్ల మంది మానవులు నివసిస్తూ ఉంటే మనిషి అంతరించిపోవడమేంటి ..? అని వెటకారంగా చూడకండి. చిన్ననాటి నుంచి మనం సోషల్ స్టడీస్‌ పుస్తకాల్లో ఆది మానవుడి గురించి ఆసక్తిగా చదువుకున్నాం. ఆయన నిప్పు కనిపెట్టాడంటే అబ్బా అన్నాం..ఆకులు కప్పుకుని తిరిగాడంటే అయ్యో పాపం అని దేవుడిని తలచుకున్నాం. ఇప్పుడు ఆ ఆది మానవుని వారసులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పచ్చి నిజం..తరానికి తరానికే సంస్కృతి, సంప్రదాయాలు మారిపోతున్న సమయంలో ఈ ఆదిమ మానవుడి జాతి కూడా అంతర్థానమయ్యే దశకు చేరింది.

 

మానవుడి పుట్టిక ప్రారంభమైన ఆఫ్రికాలోని బోట్స్‌వానా, అంగోలా, నమీబియాల్లో శ్యాన్ తెగగా పిలిచే వీరే తొలి మానవుడి వారసులని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా నిపుణులు తేల్చారు. వీరు దాదాపు 20 వేల ఏళ్ల కిందటి నుంచే ఆఫ్రికా ఖండంలోని అటవీప్రాంతాల్లో నివసిస్తున్నారు. బోట్స్‌వానాలో వీరిని బసర్వాలని పిలుస్తారు. వీరు సంచార జీవితమే ఎక్కువగా గడుపుతారు.

 

అసలు ఇంత చర్చకు కారణం, బోట్స్‌వానా రిజర్వ్ ఫారెస్ట్‌ ప్రాంతంలో నివసించే వీరిని అక్కడి ప్రభుత్వం మైదాన ప్రాంతాలకు తరలిస్తోంది. వారికి పునరావాసం కల్పిస్తోంది. వీరు ఎప్పుడైతే అడవులను వీడి మైదాన ప్రాంతాల్లోకి వస్తారో..అప్పుడు శ్యాన్ జాతిపై పాశ్చాత్య ప్రభావం పడి వీరు మామూలు మనుషుల్లో కలిసిపోతారు. దీని వల్ల వారి సంస్కృతీ సంప్రదాయాలు పూర్తిగా మారిపోనున్నాయి. వీరి పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే వారు అనాదిగా మాట్లాడుతూ వచ్చిన ఆదిమ భాష క్రమంగా కనుమరుగుకానుంది. ఇప్పటికే వారి నృత్య రీతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వారి సంప్రదాయ కళలు కూడా నశించిపోబోతున్నాయి. ఎంతో మంది చరిత్రకారులు, కళాకారులు ఆదిమ జాతుల కళలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నా పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇకపై ముందు తరాల వారికి వీరి గురించి చెప్పాలంటే పుస్తకాలే దిక్కు. అందుకే శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...