మనవి భలే కోర్టులు
posted on May 11, 2015 12:13AM

మొత్తానికి మన దేశంలో కోర్టులు భలే కోర్టులు. ఒక్కోసారి సంవత్సరాలకు సంవత్సరాలు కేసులు విచారిస్తాయి. ఒక్కోసారి లటుక్కుమని తీర్పులు ఇచ్చేస్తాయి. దీనికి సంబంధించిన జ్ఞానం లేనివారికి జ్ఞానోదయం కలిగే విధంగా తాజాగా రెండు తీర్పులు వెలువడ్డాయి. ఒకటి సల్మాన్ ఖాన్ కేసు. మరోటి జయలలిత కేసు. సల్మాన్ ఖాన్ తాగి డ్రైవ్ చేసి ఒకర్ని చంపేశాడనే కేసు, జయలలిత అక్రమాస్తుల కేసు దశాబ్దాల తరబడి విచారణ జరిగి సెషన్స్ కోర్టులు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించాయి. అటు ముంబై హై కోర్టు, ఇటు కర్నాటక హైకోర్టు ఇద్దరికీ సపోర్టుగా నిలిచాయి. సల్మాన్ ఖాన్ కేసు విచారణ జరిగా జరగలేదని ముంబై హైకోర్టు ఒక్క రోజులో చెప్పేసింది. మళ్ళీ విచారణ జరగాల్సిన అవసరం వుందని చెప్పి ఇక ఈ కేసు తేలిపోయినట్టేనని చెప్పకనే చెప్పేసింది. ఇక జయలలిత తన ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని వదులుకునేలా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే నాలుగైదు నెలల్లోనే పెద్దగా విచారణ ఏమీ జరగకుండానే కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించేసింది. వీళ్ళిద్దరినీ దోషులుగా తేల్చడానికి సెషన్స్ కోర్టులకు దశాబ్దాల తరబడి పడితే, గౌరవనీయమైన హైకోర్టులు మాత్రం రోజుల్లోనే వీరిని నిర్దోషులుగా తేల్చేశాయి. ఇంత గొప్పగా పనితీరును కనబరుస్తున్న హైకోర్టులకు వందనం, అభివందనం. ఇలాంటి భలే కోర్టులు మన దేశంలో వున్నందుకు దేశ పౌరులుగా మనం గర్వించాలి.