Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికాను వెంటాడుతున్న సద్దాం హుస్సేన్
posted on: Jul 6, 2016 3:17PM

సద్దాం హుస్సేన్ మరణించి ఇప్పటికి పదేళ్లు. కానీ సద్దాం హుస్సేన్ పేరు ఇప్పుడు అమెరికాను ఆత్మన్యూనతకు లోను చేస్తున్నట్లు కనిపిస్తోంది. సద్దాంను హతమార్చడం ఆ దేశ ప్రజల్లో కొందరికి ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఇరాక్ మీద ఆధిపత్యాన్ని సాధించేందుకు, చమురు సామ్రాజ్యంలో తమకు తిరుగు లేకుండా ఉండేందుకు అమెరికా, బ్రిటన్లు కలిసి 2003లో సద్దాం మీద యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నవారిని సముదాయించేందుకు రకరకాల కారణాలను చూపించాయి. సద్దాం వద్ద జీవరసాయనాలతో నిండిన అస్త్రాలు ఉన్నాయనీ.... సద్దాం తల్చుకుంటే వాటిని కేవలం 45 నిమిషాల్లో ఈ ప్రపంచం మీదకు ప్రయోగించగలడనీ ప్రచారం చేశాయి. సాక్షాత్తూ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ ఈ ప్రచారాన్ని ముందుండి నడిపించారు.
ఉన్నాయో లేవో తెలియని ఆ అస్త్రాలను సాకుగా చూపించి ఇరాక్ మీద యుద్ధం చేశారు. ఫలితం! సద్దాం హుస్సేన్ మీద పగసాధించారే కానీ, ఇరాక్ను మాత్రం దిక్కులేని దేశంగా వదిలిపెట్టేశారు. అంతర్గత రాజకీయాలతో కొట్టుకుంటున్న ఇరాక్ మీద ISIS తీవ్రవాద సంస్థ చాలా తేలికగా పట్టు సాధించింది. అందుకే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ‘సద్దాం హుస్సేన్ చెడ్డవాడే కానీ, అతను తీవ్రవాదుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవాడు’ అంటూ సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. కేవలం సద్దాం హుస్సేన్ విషయంలోనే ఇలా జరగలేదు. లిబియా దేశపు నియంత గడాఫీ కూడా తన మాట వినడం లేదంటూ 2011లో ఆయనను తుదముట్టించింది అమెరికా. కానీ ఆ తరువాత లిబియాను పట్టించుకోకుండా వదిలేసింది. ఫలితం! లిబియా కూడా అంతర్యుద్ధాలతో, ఉగ్రవాదంతో రణరంగంగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా తాము లిబియాను అలా వదిలేయడం ఘోర తప్పిదం అంటూ ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రతి దేశమూ తనకు అనుకూలంగా వ్యవహరించాలనీ, లేకపోతే నయానో భయానో వారిని తమ దారికి రప్పించుకుంటామనీ భావించే అమెరికాకు ఇప్పుడు తప్పు తెలిసి వస్తున్నట్లుంది. కానీ ఏం లాభం! తమను నిలువరించే వెన్నులేని దేశాల పుణ్యమాని ఇప్పుడు ప్రపంచం ఐఎస్ గుప్పిట్లోకి జారిపోతోంది.





