Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ.. లంకపై ఇండియా-ఎ థ్రిల్లింగ్ విక్టరీ!
posted on: Jun 10, 2026 10:55AM

శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో ఇండియా–ఎ జట్టు అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఘన విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో శ్రీలంక–ఎ జట్టుపై భారత్ 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి, సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. ఈ విజయానికి లీడింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ క్లాసిక్ సెంచరీ, కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ ప్రధాన కారణం కాగా, చివర్లో బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టును గెలిపించారు.
టాస్ గెలిచిన ఇండియా–ఎ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత్కు ఆరంభంలోనే ఊహించని గట్టి షాక్ తగిలింది. కేవలం 16 పరుగులకే ఇద్దరు కీలక ఓపెనర్లు పెవిలియన్కు చేరారు. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 పరుగులు చేయగా, ప్రభ్సిమ్రన్ సింగ్ 2 పరుగులకే అవుటై నిరాశపరిచారు. ఈ క్లిష్ట సమయంలో అనుభవజ్ఞుడైన రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతనికి తోడుగా వచ్చిన ప్రియాన్షు ఆర్యా కూడా 32 పరుగులతో బ్యాట్ ఝుళిపించి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వీరిద్దరూ మూడో వికెట్కు 53 పరుగులు జోడించిన తర్వాత ప్రియాన్షు దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి రుతురాజ్ లంక బౌలింగ్ను చీల్చిచెండాడాడు. ఈ ఇద్దరూ దాదాపు 31 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 పరుగులు చేసి తన లిస్ట్-ఎ కెరీర్లో 21వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ తిలక్ వర్మ కూడా 60 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో వికెట్కు వీరిద్దరూ ఏకంగా 150 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించడంతో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. ఆఖర్లో ఆయుష్ బదోని 24 పరుగులు, సుర్యాన్ష్ షెడ్జే 26 పరుగులు (నాటౌట్) వేగంగా ఆడటంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల మంచి టార్గెట్ను శ్రీలంక ముందు ఉంచింది. లంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.
278 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఎ జట్టుకు ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా (47), అవిష్క ఫెర్నాండో (45) మొదటి వికెట్కు 93 పరుగులు జోడించి అద్భుతమైన పునాది వేశారు. అయితే భారత స్పిన్నర్లు అద్భుతంగా పుంజుకుని, స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరితో పాటు నువానిందు ఫెర్నాండో (8)ను కూడా అవుట్ చేయడంతో లంక 109 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో సదీరా సమరవిక్రమ (46), లంక కెప్టెన్ సహాన్ అరాచ్చిగే కలిసి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ నాల్గో వికెట్కు 78 పరుగులు జోడించి మ్యాచ్ను మళ్లీ లంక వైపు తిప్పే ప్రయత్నం చేశారు.


.webp)



