నేటి నుంచి షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్
posted on: Jan 24, 2026 10:41AM

తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు నేటితో తప్పనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. నిన్నహైదరాబాద్లోని మాదాపూర్ శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ షోరూమ్లో ఈ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో సంయుక్త రవాణా కమిషనర్ (జేటీసీ) మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ స్వయంగా వాహనదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.
కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ ఇలా
ఈ కొత్త విధానం ప్రకారం, వెహికల్ కొనుగోలు చేసిన తర్వాత డీలరే రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, ఇన్సూరెన్స్, అడ్రస్ ప్రూఫ్, వాహన ఫొటోలు వంటి అవసరమైన పత్రాలన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు.
రవాణా శాఖ అధికారి ఆ దరఖాస్తును ఆన్లైన్లోనే పరిశీలించి, వెంటనే రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు. ఉదయం వాహనం కొంటే సాయంత్రంలోగా, సాయంత్రం కొంటే మరుసటి రోజు ఉదయంలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా వాహన యజమాని చిరునామాకు చేరుతుంది. అయితే, ఈ కొత్త విధానం కేవలం ప్రైవేట్ వాహనాలైన బైక్లు, కార్లకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.






