ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ మృతి

posted on: Apr 24, 2026 9:19AM

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతూ..  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ) చికిత్స పొందుతూ కన్నుమూశారు. విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేసే ఆయన..  కార్మికుల భవిష్యత్తు కోసం ప్రాణాలను త్యాగం చేయడం ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన శంకర్‌గౌడ్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో గురువారం నాడు బస్టాండ్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో   80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆయన పరిస్థితి విషమించింది. తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (ఏప్రిల్ 24) తెల్లవారుజామున  తుదిశ్వాస విడిచారు.  కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శంకర్‌గౌడ్ స్వగ్రామం నర్సంపేట మండలంలోని ముత్తోజిపేటకు తరలించారు.  

సీఎం దిగ్భ్రాంతి

శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి  ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.  శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్ష ఆర్టీసీ కార్మికులతో ప్రభు త్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెమూడో రోజుకు చేరుకుంది.  ప్రభుత్వ మొండి వైఖరి వల్లే తమ సహచర కార్మికుడు మరణించాడని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌గౌడ్ మృతితో కార్మికుల నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా కొందరు కార్మికులు నిరసనగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. 

అంతకు ముందు..  కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో హాస్పిటల్ వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ ను చూసేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్ళారు. అయితే ఆమెను ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తాను ప్రజాప్రతినిథిననీ,    ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించడానికి వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారనీ కవిత పోలీసులను నిలదీశారు.  అక్కడే రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు. ఈ సమయంలో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.  

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్మికులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు   ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల కమిటీ  శుక్రవారం (ఏప్రిల్ 24) కార్మిక సంఘాలతో చర్చలు జరపనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...