Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రూ.3 లక్షల పది రూపాయల నాణేలతో బుల్లెట్ బైక్ కొన్న వ్యాపారి!
posted on: May 22, 2026 3:48PM

సరికొత్త బైక్ కొనడం చాలా మందికి ఒక కల. అయితే ఆ కల కోసం ముప్పై ఏళ్లుగా నిరీక్షించి, వినూత్న రీతిలో దాన్ని సాకారం చేసుకున్నారు బాపట్ల జిల్లాకు చెందిన ఓ సాధారణ వ్యాపారి. ఏకంగా రూ.3 లక్షల విలువైన పది రూపాయల నాణేలను సేకరించి, వాటితో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానికంగా ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
బాపట్ల జిల్లా చీరాల మండలం పరిధిలోని పాత చీరాల గ్రామానికి చెందిన రాసాని రాఘవ వృత్తిరీత్యా చేపల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. చిన్నతనం నుంచే ఆయనకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనం అంటే అమితమైన ఇష్టం. గ్రామంలో ఎవరైనా ఆ బైక్ వేసుకుని వెళ్తుంటే ఎప్పటికైనా తాను కూడా అలాంటి వాహనాన్ని సొంతం చేసుకోవాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే రూపాయి రూపాయి పోగు చేస్తూ తన కలల సాకారానికి నాంది పలికారు.
గత కొన్నేళ్లుగా తనకు వ్యాపారంలో వచ్చే ఆదాయంలో కొంత భాగం, ముఖ్యంగా పది రూపాయల నాణేలను రాఘవ ప్రత్యేకంగా భద్రపరచడం ప్రారంభించారు. అలా నిరంతర శ్రమతో సుమారు రూ.3 లక్షల విలువైన కాయిన్స్ను సేకరించారు. ఆ నాణేలన్నింటినీ బస్తాల్లో నింపుకుని వాహనం కొనేందుకు స్థానిక షోరూమ్ల చుట్టూ తిరిగారు. అయితే అంత పెద్ద మొత్తంలో ఉన్న చిల్లర నాణేలను లెక్కించడం సాధ్యం కాదంటూ పలువురు వ్యాపారులు ఆయనను వెనక్కి పంపించేశారు.
షోరూమ్ నిర్వాహకులు నిరాకరించడంతో రాఘవ కొంత నిరాశకు గురైనప్పటికీ తన పట్టుదలను మాత్రం కోల్పోలేదు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ను సంప్రదించారు. రాఘవ పట్టుదలను, బైక్పై ఆయనకున్న మక్కువను గమనించిన అక్కడి యాజమాన్యం ఆ నాణేలను తీసుకునేందుకు సానుకూలంగా స్పందించింది. నాలుగు రోజుల పాటు సిబ్బంది సాయంతో ఆ కాయిన్స్ అన్నింటినీ లెక్కించి ఎట్టకేలకు కొత్త వాహనాన్ని అందజేశారు.
ఈ అరుదైన క్షణంపై రాఘవ హర్షం వ్యక్తం చేస్తూ.. తన మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని సంతోషపడ్డారు. వాహనం పొందిన అనంతరం ఆయన తన భార్య శ్రీలక్ష్మితో కలిసి కొత్త బైక్పై ఊరంతా చక్కర్లు కొట్టారు. వ్యాపారంలో కష్టపడుతూనే, తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు.
సాధారణంగా మార్కెట్లో పది రూపాయల నాణేల చెలామణిపై అక్కడక్కడా అపోహలు కొనసాగుతున్న తరుణంలో, ఏకంగా మూడు లక్షల కాయిన్స్తో వ్యాపారి ఒకరు బైక్ కొనడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నాణేల స్వీకరణకు ముందుకొచ్చిన ఒంగోలు షోరూమ్ యాజమాన్యాన్ని సైతం స్థానికులు, నెటిజన్లు ఎంతగానో అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పట్టుదల గల వ్యక్తుల కథనాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నారు.


.webp)
.webp)


