Latest News
తెలుగు రాష్ట్రాల్లో కుబేరులు వీరే...ఎక్కువ సంపద ఎవరిదంటే?
posted on: Mar 13, 2026 9:33PM

ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితాను ప్రకటించే ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించిన బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్కు చెందిన కుబేరుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. గత ఏడాది 205 మంది మాత్రమే ఉండగా, ఈసారి భారత బిలియనీర్ల సంఖ్య 229కి చేరింది. దేశంలో పలు రంగాల్లో వ్యాపారాలు విస్తరిస్తూ ఉండటంతో సంపద పెరుగుదల కూడా వేగంగా జరుగుతోందని ఫోర్బ్స్ నివేదిక చెబుతోంది.
ఫోర్బ్స్ వివరాల ప్రకారం భారత బిలియనీర్ల మొత్తం సంపద లక్ష కోట్ల డాలర్ల మార్క్ను దాటింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 92 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. గత సంవత్సరం ఇది 941 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈసారి గణనీయంగా పెరిగింది. దేశంలోని టాప్-10 అత్యంత ధనవంతుల సంపద మాత్రమే రూ. 33 లక్షల కోట్లకుపైగా ఉండటం విశేషం. మొత్తం బిలియనీర్ల సంపదలో ఇది మూడో వంతుకంటే ఎక్కువగా ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది.
ఈ జాబితాలో ముకేశ్ అంబానీ మరోసారి భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఆయన సంపద గత ఏడాదితో పోలిస్తే దాదాపు 12 శాతం పెరిగింది. ఆయన తర్వాత స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. అదే సమయంలో సావిత్రి జిందాల్ దేశంలో అత్యంత ధనిక మహిళగా గుర్తింపు పొందారు. ఇక ఉదయ్ కొటక్ తొలిసారిగా భారత టాప్-10 ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే, అరవింద్ శ్రీనివాస్ (31) ఈసారి అత్యంత పిన్న వయస్కుడైన భారత బిలియనీర్గా నిలిచారు. ఆయన కృత్రిమ మేధస్సు రంగంలోని కంపెనీ పర్ప్లెక్సిటీ కో ఫౌండర్ సహ వ్యవస్థాపకుడు.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈసారి 10 మంది బిలియనీర్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. వారిలో మురళీ దివి అగ్రస్థానంలో నిలిచారు. దివీస్ ల్యాబోరేటరీస్ అధినేత అయిన ఆయన సంపద 10.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 93 వేల కోట్లు)గా ఉంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కుబేరుల జాబితా ఇలా ఉంది:
మురళీ దివి (దివీస్ ల్యాబోరేటరీస్) - 10.1 బిలియన్ డాలర్లు (రూ. 93 వేల కోట్లు)
జీఎం రావు (జీఎంఆర్ గ్రూప్) - 3.9 బిలియన్ డాలర్లు (రూ. 35 వేల కోట్లు)
ప్రతాప్ సి. రెడ్డి (అపోలో హాస్పిటల్స్) - 3.6 బి.డాలర్లు (రూ. 33 వేల కోట్లు)
బి. పార్థసారథి రెడ్డి (హెటిరో గ్రూప్) - 3.4 బి.డాలర్లు (రూ. 31 వేల కోట్లు)
మహిమా దాట్ల (బయోలాజికల్ ఇ- లిమిటెడ్) - 3.2 బి.డాలర్లు (రూ. 29 వేల కోట్లు)
పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా)- 3 బి.డాలర్లు (రూ. 27 వేల కోట్లు)
ఎం. సత్యనారాయణ రెడ్డి (MSN గ్రూప్) - 2.9 బిలియన్ డాలర్లు (రూ. 26 వేల కోట్లు)
జూపల్లి రామేశ్వరరావు (మై హోం గ్రూప్)- 2.3 బి.డాలర్లు (రూ. 21 వేల కోట్లు)
పీవీ కృష్ణారెడ్డి (MEIL- మేఘా ఇంజినీరింగ్) - 2.1 బిలియన్ డాలర్లు (రూ. 19 వేల కోట్లు)
పీ పిచ్చి రెడ్డి (MEIL- మేఘా ఇంజినీరింగ్) - 2 బిలియన్ డాలర్లు (రూ. 18 వేల కోట్లు)
వ్యాపారం, ఔషధ తయారీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్య రంగాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు గణనీయంగా రాణించడం వల్ల ఈసారి బిలియనీర్ల జాబితాలో వారి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇది దక్షిణ భారత వ్యాపార శక్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లైంది.



.webp)


