స్థానిక ఎన్నికల విధానంలో విప్లవాత్మక మార్పులకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం?

posted on: Aug 6, 2026 12:49PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిచంద్రబాబు ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది.  మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)లతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.  ఇదే కనుక నిజమైతే..  స్థానిక రాజకీయాల్లో  ఇదో విప్లవాత్మక మార్పు అని పరిశీలకులు అంటున్నారు. 

ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది. అంటే..  ఓటర్లు వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎన్నుకుంటే.. ఆ ప్రజాప్రతినిధులు తమ నాయకులను ఎన్నుకుంటారు.  ఈ పరోక్ష ఎన్నికల విధానంపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి  నేపథ్యంలో..  అన్ని స్థాయిల్లోనూ ప్రజలే నేరుగా నాయకులను ఎన్నుకునేలా చట్ట సవరణ తీసుకువచ్చేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  

ఈ కొత్త విధానం కనుక అమల్లోకి వస్తే..   మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  ప్రజలు వార్డు కౌన్సిలర్,  కార్పొరేటర్‌తో పాటు మున్సిపల్ ఛైర్మన్,  మేయర్ లను కూడా నేరుగా   ఓటు వేసి ఎన్నుకుంటారు.  అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది.  దీనివల్ల స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరుగుతుంది.  

 పరోక్ష ఎన్నికల సమయంలో క్యాంపు రాజకీయాలు, బేరసారాలు, ఒత్తిళ్లు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలకు ఈ విధానం పూర్తిగా చెక్ పెడుతుంది. అంతే కాకుండా,  మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ, బలవంతపు క్యాంపులు,  ఇతర రాజకీయ  వ్యూహాల వల్ల ఎన్నికల ప్రక్రియలో జాప్యం, వివాదాలకు తావు లేకుండా పోతుంది.  

కాగా ఈ నిర్ణయం పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమౌతోంది.  ఓటర్లు నేరుగా తమ నాయకుడిని ఎన్నుకోవడం వల్ల  పాలనలో పారదర్శకత వస్తుందని, జవాబుదారీ తనం పెరుగుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో త్వరలో   స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటి లోగా సంబంధిత   బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం పొంది  చట్టరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   

Revolutionary refoems in local body elections,  AP Local Body Elections 2026, AP Direct Elections Reform, Andhra Pradesh Local Body Reforms,  municipal chairman,  Mayor Direct Elections 

google-ad-img
    Related Sigment News
    • Loading...