ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. కొత్త ఒరవడి సృష్టిస్తున్న నారా లోకేష్.!

posted on: Jul 14, 2026 10:44AM

ఏపీలోని గవర్నమెంట్ స్కూళ్లు కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి.  ఒకప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన ర్యాంకులు..  ఇప్పుడు సర్కారీ బడులకూ దక్కుతున్నాయి. దక్కడమే కాదు.. కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థులకు దీటుగా సర్కారీ బడులలో విద్యార్థులు ర్యాంకులలో పోటీ పడుతున్నారు.  ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన  విజయాలు రాష్ట్రవ్యాప్తంగా  సంచలనంగా మారాయి.  ప్రైవేట్ అకాడమీల హడావుడిని పక్కకు నెట్టి..  పేద విద్యార్థులు తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో మెరిసిపోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ అపూర్వ విజయాలను వేడుకగా జరుపుకోవడానికి,  విద్యార్థులను మరింత ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం తాడేపల్లిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా షైనింగ్ స్టార్స్  అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ వేడుకలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్   ప్రభుత్వ బడుల్లో టాపర్లుగా నిలిచిన ప్రతిభావంతులను  సత్కరించారు. ఈ విద్యాసంవత్సరంలో టెన్త్ క్లాస్ టాపర్లుగా నిలిచిన 55 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి 30 వేల రూపాయల నగదు బహుమతి,  ప్రత్యేక మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన 61 మంది  విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు,గోల్డ్ మెడల్స్ అందజేశారు.  ఈ గుర్తింపు కేవలం విద్యార్థులకే కాకుండా, వారిని ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు, రాత్రింబగళ్లు శ్రమించిన ఉపాధ్యాయులకు దక్కిన నిజమైన గౌరవం అనడంలో సందేహం లేదు. 

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2024 లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ..  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపైనే కాకుండా, విద్యార్థుల చదువుల నాణ్యతపై కూడా విద్యాశాఖ  మంత్రి నారా లోకేష్  ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పాస్ పర్సంటేజ్ 72.8 శాతంగా ఉండేది. అయితే  విప్లవాత్మక సంస్కరణలు, ఉపాధ్యాయుల కఠోర శ్రమ ఫలితంగా ఈ ఏడాది అది  78.39 శాతానికి పెరిగింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది తరగతి ఉత్తీర్ణత శాతం గత ఏడాది  81.1 శాతంఅయితే అది ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగింది.   100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక , లీప్  లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్, ఏఐ టూల్స్,   వన్ క్లాస్-వన్ టీచర్ లాంటి వినూత్న విధానాలు విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను వెలికితీశాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో   విద్యా ప్రమాణాలను చూసి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల నుండి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి భారీగా తరలివస్తున్నారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుండి ప్రభుత్వ బడుల్లోకి మారారు. ఈ సానుకూల ధోరణిని  ముందుకు తీసుకెళ్తూ..  వచ్చే విద్యాసంవత్సరంలో కనీసం 2 లక్షల మంది విద్యార్థులను ప్రైవేట్ సంస్థల నుండి ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించడమే లక్ష్యంగా   మంత్రి నారా లోకేష్  టార్గెట్ నిర్దేశించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరక్క  నో అడ్మిషన్ బోర్డులు పెట్టే స్థాయికి మన విద్యావ్యవస్థ చేరుకుందని, దేశమంతా ఏపీ విద్యా మోడల్ గురించి మాట్లాడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా  ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ట్యూటర్లు, కేంద్రీకృత వంటశాలల విస్తరణ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిని మించి తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. 

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం పథకం కింద ప్రత్యేక  సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్  (సీఓఈ)ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐఐటీ, జేఈఈ, నీట్  వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన కార్పొరేట్ స్థాయి ఉచిత శిక్షణ, నిపుణుల మార్గదర్శకత్వం,  ఆధునిక వసతులు అందించేలా ఈ ఉన్నత స్థాయి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.  

Nara Lokesh, Setting New Trend, TeluguOne, AP Government Schools, Nara Lokesh Education Reforms 

google-ad-img
    Related Sigment News
    • Loading...