ఇంధన రంగంలో కొత్త విప్లవం.. బొగ్గును గ్యాస్‌గా మార్చే భారీ ప్రాజెక్టు

posted on: May 14, 2026 3:32PM

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల అనిశ్చితిని తట్టుకుంటూ, స్వదేశీ వనరులతోనే దేశ అవసరాలను తీర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా అందుబాటులో ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ స్వయం సమృద్ధి సాధించాలని భావిస్తోంది. ఇందు కోసం .92 బిలియన్ డాలర్లు అంటే సుమారు 37,500 కోట్ల రూపాయలతో   పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 

ఈ నిర్ణయం భారత ఇంధన రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.  ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా బొగ్గును నేరుగా మండించే పాత పద్ధతులకు స్వస్తి పలికి..  దానిని రసాయనిక ప్రక్రియ ద్వారా  సింథటిక్ గ్యాస్ అంటే.. సింగ్యాస్ గా మారుస్తారు. బొగ్గు నుంచి కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్,  కార్బన్ డై ఆక్సైడ్ల మిశ్రమాన్ని తయారు చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల పారిశ్రామిక అవసరాలకు అవసరమైన ఇంధనం స్వచ్ఛమైన రూపంలో లభిస్తుంది.  సింగ్యాస్ వినియోగం కేవలం విద్యుత్ రంగానికే పరిమితం కాకుండా, బహుళ ప్రయోజనాలను చేకూరుస్తుంది.  బొగ్గు గ్యాసిఫికేషన్ అనేది బొగ్గును రసాయనిక ప్రక్రియ ద్వారా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ మిశ్రమంగా (సింగ్యాస్) మార్చే పద్ధతి. ఈ వాయువును కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా, ఎరువులు (యూరియా, అమ్మోనియా), మెథనాల్, ఎల్పిజి ప్రత్యామ్నాయాలు మరియు వివిధ పెట్రోకెమికల్స్ తయారీలో ముడిపదార్థంగా ఉపయోగించవచ్చు. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన యూరియా, అమ్మోనియా వంటి ఎరువుల తయారీలోనూ, పెట్రోకెమికల్స్, మెథనాల్,  ఎల్పీజీ ప్రత్యామ్నాయాల ఉత్పత్తిలోనూ దీనిని ముడి పదార్థంగా వాడుకోవచ్చు. తద్వారా రసాయన పరిశ్రమల్లో భారత్ స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది.  

ప్రస్తుతం ఇండియా తన అవసరాల కోసం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ), ఎరువుల దిగుమతి కోసం మధ్యప్రాచ్య దేశాలపై అధికంగా ఆధారపడుతోంది. గల్ఫ్ దేశాల్లో తలెత్తే రాజకీయ ఉద్రిక్తతలు   ఇంధన సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశంలో అందుబాటులో ఉన్న సుమారు 401 బిలియన్ టన్నుల బొగ్గు, 47 బిలియన్ టన్నుల లిగ్నైట్ నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వాడుకోవడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా ఆర్థిక రక్షణ కవచం ఏర్పడుతుంది.  ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్లాంట్ మరియు యంత్రాల కొనుగోలుపై 20 శాతం వరకు ఆర్థిక  గ్రాంట్  ప్రకటించింది. దీనితో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ దిగ్గజాలు కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీపీసీ (ఎన్టీపీసీ) వంటి సంస్థలు రాబోయే కొద్ది కాలంలోనే ఏటా 5 నుంచి 10 మిలియన్ టన్నుల సింథటిక్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.  

పారిశ్రామిక వృద్ధి మాత్రమే కాకుండా, ఈ పథకం ద్వారా భారీస్థాయిలో ఉపాధి కల్పన జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు పాతిక భారీ ప్రాజెక్టులు ఏర్పాటు కావడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. మొత్తంగా ఈ రంగంలో   3 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.  అంతర్జాతీయంగా అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే ఈ సాంకేతికతను వినియోగిస్తుండగా, భారత్ ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయడం, సాంకేతిక పరమైన సవాళ్లను అధిగమించడం భవిష్యత్తులో అత్యంత కీలకం కానుంది. బొగ్గును కేవలం ఇంధనంగానే కాకుండా ఒక విలువైన ఆర్థిక వనరుగా మార్చే ఈ ప్రయత్నం భారతదేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేయనుంది.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...