Latest News
రేవంత్ని వేధిస్తున్నారా?
posted on: Jun 15, 2015 7:27PM

ఓటుకు నోటు ఇష్యూలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అరెస్ట్ చేసి పదిహేను రోజులు అయింది. పదిహేను రోజులుగా రిమాండ్లో వున్న ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ని పొడిగించింది. ఆయనకు మరో పదిహేను రోజుల రిమాండ్ని ఏసీబీ కోర్టు విధించింది. ఈ తాజా ఆదేశాల ప్రకారం ఈనెల 29వ వరకు రేవంత్ రెడ్డి రిమాండ్లోనే ఉండాల్సి వుంటుంది. రేవంత్తోపాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాకు కూడా రిమాండ్ పొడిగించారు. అయితే ఈ ముగ్గురూ మాత్రం తమకు రిమాండ్ పొడిగించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో రేవత్కి రిమాండ్ పొడిగించడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రిమాండ్ పూర్తి కాగానే ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. ఇప్పటికే ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని నాలుగు రోజులపాటు ప్రశ్నించింది. ఏసీబీ విచారణ పూర్తయిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వడమే న్యాయం అవుతుంది.
అయితే ఎవరూ ఊహించని విధంగా రేవంత్ తదితరులకు రిమాండ్ పొడిగించడం విచిత్రంగా వుందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసును ప్రభావితం చేస్తారని, సాక్షులను బెదిరిస్తారని, విచారణకు సహకరించరని... ఇలా రకరకాల కారణాలు చెప్పి రిమాండ్ పొడిగించడం రేవంత్ని వేధించడమే అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ హైకోర్టు మీదే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో వున్న ఏసీబీ తనకు న్యాయం చేయదని ఆయన భావిస్తున్నట్టున్నారు. అందుకే ఆయన హైకోర్టు తలుపులు తట్టారు. ఏసీబీ రేవంత్ని విచారించ దలచుకుంటే గడచిన15 రోజుల్లో పూర్తిగా విచారించవచ్చు. నాలుగు రోజులు మాత్రమే విచారణ జరిపి, ఇప్పుడు మళ్ళీ రిమాండ్ పూర్తయిన తర్వాత ఇంకా విచారణ జరపాలనే ఉద్దేశంతో ఉన్నానని, అందువల్ల రిమాండ్ పొడిగించాలని కోరడం భావ్యం కాదన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి బెయిల్ దొరకకుండా చేయడం ఆయనను వేధించడంగానే భావించాల్సి వస్తుందని పలువురు అంటున్నారు.


.jpg)



