తీవ్రవాదులపై పైచేయి – ఈ రిపబ్లిక్ డే!

posted on: Jan 26, 2016 3:43PM

ఒక పక్క పఠాన్‌కోట్‌ దాడులు, మరో పక్క ప్రపంచవ్యాప్తంగా పేట్రేగిపోతున్న ISIS తీవ్రవాదులు… ఇన్ని ప్రమాదాల నడుమ కూడా గణతంత్ర దినోత్సవం మరోసారి ఘనంగా జరిగింది. గణతంత్ర దినోత్సవానికి కొన్ని నెలల ముందు నుంచే అప్రమత్తంగా ఉన్న రక్షణ యంత్రాంగం ఎప్పటికప్పుడు అనుమానితుల మీద అదుపు సాధించడంతో ఇది సాధ్యమైంది. ప్రధానమంత్రితో పాటుగా, దేశంలోని ముఖ్య పట్టణాల మీద దాడి చేసేందుకు ISIS పన్నిన వ్యూహాలను దేశ రక్షక దళాలు సమర్థంగా ఛేదించారు. అదను చూసి దేశవ్యాప్తంగా ఒకేసారి 14 మంది తీవ్రవాదులను అదుపులోకి తీసుకోవడంతో గణతంత్రానికి పెను ముప్పు తప్పింది.

ఈనాటి గణతంత్ర వేడుకలతో ఫ్రాన్స్‌ దేశపు అధ్యక్షుడైన హాలన్‌ ఆతిధ్యం స్వీకరించగా, మన త్రివిధ దళాలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో కవాతుని నిర్వహించాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా మరో దేశపు (ఫ్రాన్స్‌) సైనిక దళాలు కూడా ఈ కవాతులో పాల్గొన్నాయి. ఇక దాదాపు 26 సంవత్సరాల తరువాత సైన్యానికి అత్యంత విశ్వాసంగా మెలిగే శునకాలు కూడా తమ యజమానులతో కలిసి కవాతుని సాగించాయి. అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా గేట్‌ వద్దనున్న అమర్‌జవాన్‌ జ్యోతికి నివాళులు అర్పించి, రాష్ట్రపతిని సాదరంగా రాజ్‌పథ్‌కి తోడ్కొని వచ్చారు. ఒక పక్క గగనతలంలో సైనిక విమానాలు విన్యాసాలు చేస్తుండగా, మరో పక్క సైన్యానికి చెందిన వివిధ రెజిమెంట్లు తమ తమ పరాక్రమాలను ప్రదర్శించాయి. 17 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ఈసారి గణతంత్రం వేడుకలలో పాల్గొనగా వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన శకటాలు లేకపోవడం తెలుగువారికి నిరాశ కలిగించే అంశం.

google-ad-img
    Related Sigment News
    • Loading...