పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
posted on: Feb 21, 2026 3:05PM
.webp)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై 2014లో నమోదైన పరువునష్టం కేసులో ఊరట లభించింది. శనివారం మహారాష్ట్రలో భీవండి కోర్టులో విచారణ జరగ్గా ఆయనకు బెయిల్ మంజూరైంది. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని రాహుల్ 2014లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దానిపై విచారణ జరగ్గా రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో న్యాయస్థానం కాంగ్రెస్ అగ్రనేతకు బెయిల్ మంజూరు చేసింది. గతంలో గ్యారెంటర్గా ఉన్న శివరాజ్ పాటిల్ మృతి చెందడంతో ఆయన స్థానంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ను నూతన గ్యారెంటర్గా రాహుల్ గాంధీ నియమించారు.
సప్కాల్ను హామీదారుగా కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కౌన్సెల్ నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన సాగుతోందని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో తాము కోర్టుకు సహకరిస్తున్నామని తెలిపారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, విచారణను ఎదుర్కొని నిజాన్ని కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని సంఘ్ కార్యకర్త రాజేష్ కుంటే భీవండి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నమోదైంది. విచారణ కొనసాగుతుంది.



.webp)


