ఏపీలో రోళ్లు పగిలే ఎండలు.. ఏకంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత

posted on: May 22, 2026 8:49AM

ఆంధ్రప్రదేశ్‌లో భానుడు చండప్రచండంగా చెలరేగుతున్నారు. . మే నెలలో  ఎండల తీవ్రత సాధారణమే అయినా.. ఏపీలో ఈ తీవ్రత అసాధరణ స్థాయిలో ఉంది.   రాష్ట్రంలో వీస్తున్న పశ్చిమ, వాయువ్య గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.  సూర్యుడు నిప్పుల కొలిమిలా మారి .  ఏపీ  అగ్నిగుండాన్ని తలపిస్తోంది.  పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. పిడుగురాళ్లలో గురువారం ( మే 21)  ఏకంగా 48.1 డిగ్రీల సెలసియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు రోజు అంటే బుధవారం ( మే 20)  47.6 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత,   24 గంటల్లోనే మరింత పెరిగి 48.1 డిగ్రీలకు చేరుకుంది.  

 పదేళ్ల కాలంలో పిడుగురాళ్లలో ఇంతటి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.   2016 నుండి 2025 వరకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ   45.5 డిగ్రీల మార్కు  దాటలేదు. 2019లో ఇక్కడ నమోదైన 45.5 డిగ్రీలే ఇప్పటివరకు గరిష్టం కాగా.. , ఇప్పుడు ఆ రికార్డులన్నీ చెరిగిపోయాయి. 2016 తర్వాత ఆంధ్రప్రదేశ్   చరిత్రలోనే నమోదైన రెండవ అత్యధిక ఉష్ణోగ్రత    48.1 డిగ్రీలు.  అంతకుముందు 2016 మే 2వ తేదీన ప్రకాశం జిల్లా వెలిగండ్లలో నమోదైన 48.6 డిగ్రీల సెలసియస్ ఉష్ణోగ్రత మొదటి స్థానంలో ఉంది. 

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదౌతున్నాయి.  ఏపీలో  మొత్తం 688 మండలాల్లో దాదాపు 200 మండలాలలో  44 డిగ్రీలు,  అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.  పిడుగురాళ్ల తర్వాత గురువారం (మే 21) బాపట్ల జిల్లా వేటపాలెంలో 47.6 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు  నమోదయ్యాయి.  ఎన్టీఆర్ జిల్లా తోర్రగుడిపాడులో 47.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.     తీవ్రమైన ఎండలు,  వడగాల్పుల ప్రభావం కారణంగా  ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా వనకురు గ్రామంలో పొలంలో పనిచేస్తూ కునపరెడ్డి రామకృష్ణ అనే రైతు, జగ్గయ్యపేటలో దార్ల కృష్ణ   అనే వ్యక్తి వడదెబ్బకు గురై మరణించారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...