Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తృణమూల్ లో తిరుగుబాటు.. మమతపై ఒత్తిడి
posted on: Jun 11, 2026 5:48PM

తాజా నివేదికల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ లో నిజంగానే పెద్ద స్థాయి తిరుగుబాటు కనిపిస్తోంది. 19 నుంచి 20 మంది ఎంపీలు ప్రత్యేక బ్లాక్ గా ఏర్పడి ఎన్డీయేకి మద్దతు ఇస్తారనే వార్తలు వచ్చాయి, అలాగే సాయోనీ ఘోష్ పేరు కూడా ఆ జాబితాల్లో ప్రస్తావించబడింది. అయితే ఈ చీలిక రాజకీయంగా ఎంత బలంగా కనిపించినా.. న్యాయపరంగా అది అంత సులభం కాదు యాంటీ డిఫెక్షన్ లా కింద ఇలాంటి ఎత్తుగడలు అనర్హత ప్రమాదాన్ని పూర్తిగా తొలగించవు.
తృణమూల్ కాంగ్రెస్ ఒక వ్యక్తి ఆధారిత పార్టీగా ఎదిగింది. మమతా బెనర్జీ వ్యక్తిగత చరిష్మా, ఆందోళన రాజకీయాలు, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలపై ప్రతిఘటన ఆధారంగా ఆ పార్టీ నిలబడింది. అదే కారణంగా, పార్టీ అంతర్గత బలహీనత బయటపడినప్పుడు, ఆ ప్రభావం సాధారణ పార్టీలపై కంటీ కంటే ఎక్కువగా ఉంటుంది. బీబీసీ నివేదిక ప్రకారం.. ఇటీవల టీఎంసీ నాయకత్వంపై పెరుగుతున్న అనుమానాలు, అసంతృప్తి, శాసనసభ, పార్లమెంటరీ స్థాయిలో వర్గీకరణతో ప్రస్ఫుటంగా బహిర్గతమయ్యాయి.
ఈ నేపథ్యం మరింత ప్రాధాన్యం పొందేది ఎందుకంటే టీఎంసీలో అసమ్మతి ఒక్కసారిగా పుట్టినది కాదు, అది ఎన్నికల పరాజయం, అభ్యంతరకరమైన నాయకత్వ నిర్వహణ, ఎవరు నిజమైన కేంద్ర శక్తి? అనే ప్రశ్నల నుండి ముదురుతూ వచ్చింది. పార్టీ రాజకీయ సంస్కృతి, అధినాయకత్వ శైలి, స్థానిక స్థాయిలో ఎదురయ్యే అసంతృప్తి.. మొత్తం ఇవన్నీ కలిసే.. ఈ సంక్షోభానికి దారి తీశాయి.
తాజా రిపోర్టుల ప్రకారం, 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం టీఎంసీలో మొదట ఎమ్మెల్యే స్థాయిలో, ఆ తర్వాత ఎంపీ స్థాయిలో అసంతృప్తి పెరిగింది. ఆ క్రమంలో కకోలి ఘోష్ దస్తిదార్ నాయకత్వంలో 19 నుంచి 20 మంది లోక్సభ ఎంపీలు విడి బ్లాక్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారన్న కథనం వెలువడింది. అదే సమయంలో, 2026 జూన్ 9, 10 తేదీల్లో సోనియా గాంధీ మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి, అభిషేక్ బెనర్జీకి కీలక జాతీయ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మమతా బెనర్జీ ఆ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించలేదనీ, ఆలోచించేందుకు సమయం కోరినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
ఇక్కడ అసలు విషయముంటంటు.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. ది ప్రింట్ విశ్లేషణ ప్రకారం.. 20 మంది ఎంపీలు మాకు టూ ధర్డ్స్ మెజారిటీ ఉంది అని చెప్పడం మాత్రమే చట్టపరంగా రక్షణ కాదు. పార్టీకి అధికారిక విలీనం లేకుండా, కేవలం సెపరేట్ బ్లాక్ గా నిలబడడం అనర్హత వేటు ప్రమాదాన్ని తొలగించదు.
అదే నివేదికలో లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి, , సీనియర్ అడ్వకేట్ సౌరభ్ క్రిపాల్ అభిప్రాయాల ద్వారా ఒక ముఖ్యమైన పాయింట్ ను బలంగా ముందుకు తీసుకువచ్చింది. చీలిక అనే కాన్సెప్ట్ ను యాంటీ డిఫెక్షన్ లా నుంచి డెలిబరేట్ గా తొలగించారు; మిగిలింది విలీనం మాత్రమే. అంటే.. ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు గుంపుగా మారడం వేరు.. పార్టీ సంస్థాగతంగా మరో పార్టీలో కలవడం వేరు. ఇదే ఈ వ్యవహారంలో చట్టం వర్సెస్ రాజకీయ బలం మధ్య ఉన్న అసలు యుద్ధం.
ఇక రాజకీయంగా చూస్తే.. ఈ పరిణామం మమతా బెనర్జీకి రెండు వైపుల నుంచి సంక్షోభం తెస్తోంది. ఒకవైపు పార్టీల క్రమశిక్షణ క్షీణించడం.. మరోవైపు ప్రతిపక్ష శిబిరంలో ఆమెకు ప్రత్యామ్నాయంగా పెద్ద నాయకురాలు అనే స్థానం కోసం పునఃచర్చ మొదలవడం. టీఎంసీలోని కొందరు ఎంపీలు ఎన్డీయే కి మద్దతు ఇస్తారన్న వార్తలు.. కాంగ్రెస్ తో మమతా బెనర్జీ సంబంధాల గురించి వస్తున్న గుసగుసలు ఇవన్నీ ఆమెను వ్యూహాత్మకంగా ఒంటరిని చేసే ప్రమాదం ముంచుకువస్తోందన్న భావన కలిగిస్తున్నాయి.
సాయోనీ ఘోష్ పేరు ఈ కథనాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడటం గమనార్హం. ఆమె పార్టీకి అత్యంత శబ్దాత్మక, ఫైర్ బ్రాండ్ గా కనిపించిన యువ ముఖాల్లో సాయోనీ ఘోష్ఒకరు. అలాంటి నాయకురాలు అసంతృప్తి వర్గంలో చేరితే.. అది పోస్టర్ రాజకీయాలు కాదు, బలపడిన అంతర్గత విభేదాల సంకేతం. పార్టీ తమను కాపాడలేదన్న భావన, ప్రచార సమయంలో ఒంటరిగా మిగిలిపోయానన్న ఆరోపణలు, రాజకీయ గాయాల్ని మరింత లోతు చేస్తున్నాయి.
మీడియా ఈ పరిణామాన్ని సహజంగానే మమతా యుగానికి అంతం? అన్నట్లుగా చూపిస్తోంది, కానీ.. అసలు విషయం అంతకంటే సంక్లిష్టం. ఒక వైపు, బలమైన నాయకురాలిపై తిరుగుబాటు అన్న కథనం ప్రజల ఆసక్తిని ఆకర్షిస్తోంది. మరోవైపు, వార్తాకథనాల్లో ఉపయోగించిన అభిజ్ణ వర్గాల సమాచారం, విశ్వసనీయంగా తెలుస్తోంది, వంటి పదాలు అనేక అంశాలు ఇంకా ధృవీకరణ దశలోనే ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాయి. సామాజికంగా ఇది బెంగాల్ రాజకీయాల్లో పాత వర్గాల పునరుజ్జీవనాన్ని సూచిస్తున్నది. నాయకుని చుట్టూ పార్టీ, పార్టీ చుట్టూ ప్రయోజనం, ప్రయోజనం చుట్టూ వర్గం. ప్రజలకు ఇది అసలు కొత్త కథ కాదు.. కానీ టీఎంసీ లాంటి వ్యక్తి కేంద్రీకృత పార్టీలో ఇది బయటపడినప్పుడు ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది.
ఈ పరిణామం తక్షణం మూడు ప్రభావాలు చూపే అవకాశం ఉంది. మొదట, పార్లమెంటులో టీఎంసీ అంతర్గత క్రమశిక్షణ బలహీనమైతే.. పార్టీ జాతీయ ప్రతిపక్ష పాత్ర దెబ్బతింటుంది. రెండోది.. సోనియా గాంధీ ఆఫర్ నిజమైతే, కాంగ్రెస్, టీఎంసీ మధ్య భవిష్యత్ వ్యూహాత్మక అవగాహనకు ఇది సిగ్నల్ కావచ్చు. మూడోది యాంటీ డిఫెక్షన్ లా చుట్టూ మరోసారి దేశవ్యాప్త చట్టపరమైన చర్చ మొదలయ్యే అవకాశం.
అయితే 20 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి టీఎంసీ చీలిపోయినట్లు.. అన్న వాదన సరిపోదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, సంఖ్యలపై కూడా స్పష్టత లేదు. కొందరు 16 మంది అంటున్నారు, మరికొందరు 20 అంటున్నారు, పార్టీ వర్గాలు మాత్రం ఈ సంఖ్యను తిరస్కరిస్తున్నాయి. అందువల్ల ఈ వ్యవహారాన్ని తుది తీర్పు లాగా కాదు, కొనసాగుతున్న రాజకీయ, చట్టపరమైన క్రీడగా చూడాలి.
నిజాన్ని నేరుగా చెప్పాలంటే, మమతా బెనర్జీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది చిన్న కుదుపు కాదు.. ఇది ఆమె రాజకీయ నిర్మాణం లోపలినుంచి పగలుతున్న సంకేతం. అయితే అదే సమయంలో, ఈరెబలియన్ పూర్తిగా చట్టబద్ధమైన చీలికగా గా మారిందని ఇప్పటికీ చెప్పలేం. రాజకీయంగా ఇది బీభత్సం.. న్యాయంగా ఇది ఇంకా వివాదాస్పదం. కాంగ్రెస్ ఆఫర్ వార్తలు నిజమైతే.. అది మమతను తిప్పికొట్టే రాజకీయ బ్రీఫింగ్ కాదు, ప్రతిపక్షంలో కొత్త శక్తి కేంద్రీకరణకు ప్రయత్నం. కానీ మమతా బెనర్జీ లాంటి నాయకురాలు ఇలాంటి ఆఫర్లకు సులభంగా లోబడే వ్యక్తి కాదన్న చరిత్ర కూడా గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈ వ్యవహారం “ఎవరు ఎవరిలో కలుస్తారు” అనే ప్రశ్న కన్నా, “ఎవరు ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించరు” అనే ప్రశ్నగా చూడాలి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





