ఐపీఎల్ 2026.. క్వాలిఫయర్ 1లో తలపడనున్న ఆర్సీబీ, జీటీ

posted on: May 26, 2026 11:34AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్   ముగింపు దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ సమరంలో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం (మే 26)  సాయంత్రం జరగనుంది.    ఈ  మ్యాచ్‌లో  లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో స్థానంలో  గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.    ధర్మశాల  వేదికగా ఈ హై-వోల్టేజ్ పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌  కోసం క్రికెట్ అభిమానులు అత్యంత ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. 

ఈ సీజన్‌లో రెండు జట్లు కూడా లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాయి. లీగ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ రెండు జట్లు కూడా చెరో 18 పాయింట్లతో పట్టికలో సమంగా నిలిచాయి. అయితే..  మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేత నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుండటంతో, ఇరు జట్లు విజయం కోసం  సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా, క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్‌కు వెళ్ళడానికి మరో  అవకాశం ఉంటుంది. అయినప్పటికీ..  ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా ఇరు జట్లు  తలపడనున్నాయి.

బెంగళూరు జట్టును చూస్తే..  ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే కసితో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా రన్‌మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి  కొండంత బలాన్ని ఇస్తోంది. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో జట్టు  సమతూకంతో కనిపిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన పేసర్లు ఉండటం బెంగళూరుకు అదనపు బలంగా మారింది. విరాట్ కోహ్లీ బ్యాట్ ఝులిపిస్తే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు తప్పవనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరోవైపు.. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టును కూడా  తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ సీజన్‌లో సమష్టి కృషితో అద్భుత విజయాలను అందుకున్న గుజరాత్ జట్టులో ఎందరో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వంటి నిలకడైన బ్యాటర్లతో పాటు, ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ గుజరాత్ జట్టుకు ప్రధాన ఆయుధంగా మారాడు. ఇక  సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ లీగ్ దశలో చూపించిన ఫామ్ గుజరాత్ జట్టుకు అదనపు బలంగా మారింది.

ధర్మశాలలోని హెచ్‌పీసీఏ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామంగా నిలుస్తుంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో 200కు పైగా భారీ స్కోర్లు నమోదు కావడం గమనార్హం. ఇక్కడి వేగవంతమైన అవుట్‌ఫీల్డ్ బ్యాటర్లకు ఎంతగానో సహకరిస్తుంది. అయితే..  రాత్రి వేళల్లో ఆడే మ్యాచ్ కావడంతో మంచు  ప్రభావం చూపే అవకాశం   ఉంటుంది. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడానికి మొగ్గు చూపవచ్చు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...