రాయదుర్గం భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతంటే?

posted on: Aug 21, 2026 7:34PM

 

రాయదుర్గంలోని భూముల ధరలు మరోసారి రికార్డు సృష్టించాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్ నంబర్‌ పీ1 ఎకరా రూ.264 కోట్ల రికార్డు ధర పలికింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధరగా నిలిచింది. మొత్తం 5.25 ఎకరాల భూమి విక్రయం ద్వారా టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. రాయదుర్గంలోని పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించారు. అయితే, పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు రూ.264 కోట్ల ధర పలికింది. ఇది రిజర్వ్ ధర కంటే దాదాపు 51 శాతం అధికమని అధికారులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఈ వేలం ఫలితం స్పష్టం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. రాయదుర్గంలో భూముల విలువ వేగంగా పెరుగుతున్నదానికి ఈ వేలం మరో ఉదాహరణగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో టీజీఐఐసీ గత మేలో నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్లు పలికింది. కేవలం మూడు నెలల్లోనే ఆ రికార్డును అధిగమిస్తూ ఇప్పుడు పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.264 కోట్ల ధర రావడం విశేషం. హైదరాబాద్‌లోని కీలక వ్యాపార ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరుగుతున్నదానికి ఇది నిదర్శనమని భావిస్తున్నారు.

ఎంఎస్‌టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా పూర్తి పారదర్శకంగా వేలం నిర్వహించారు. ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ప్రత్యేక ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించింది. జాతీయ స్థాయి ప్రముఖ డెవలపర్లు పోటీలో పాల్గొనడంతో వేలం అత్యంత పోటీతత్వంతో సాగింది. ఈ సందర్భంగా టీజీఐఐసీ వైస్ చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక ఐఏఎస్ మాట్లాడుతూ.. పీ1 ప్లాట్ వేలం విజయవంతం కావడం తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్‌లకున్న విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఇది కేవలం భూమికి మంచి ధర రావడం మాత్రమే కాదని, పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపు అని చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి వ్యాపార, పెట్టుబడుల కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నదని ఈ వేలం మరోసారి నిరూపించిందన్నారు. ఈ విజయానికి సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అందిస్తున్న దూరదృష్టితో కూడిన నాయకత్వమే కారణమని టీజీఐఐసీ కృతజ్ఞతలు తెలిపింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొంది. ఈ ఫలితాలతో హైదరాబాద్ దేశంలోని అగ్రశ్రేణి పెట్టుబడి కేంద్రాల సరసన మరింత బలంగా నిలిచిందని తెలిపింది.

Rayadurgam, TGIIC, CM Revanth reddy, Minister D. Sridhar Babu, Director K. Shashanka 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...