Latest News
తిరుమలలో రథసప్తమి మహోత్సవం...భక్తుల రద్దీ
posted on: Jan 25, 2026 11:09AM

రథసప్తమి సందర్బంగా తిరమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీంతో టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,654 మంది దర్శించుకోగా 34,080 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చింది.
సూర్య జయంతిని పురస్కరించుకుని నేడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.
రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఈ శ్లోకాలు పారాయణం చేయడంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం, వివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యావేక్షించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, ఎన్. సదాశివరావు, నరేష్ , శాంతా రామ్, జానకి దేవి, దివాకర్ రెడ్డి పాల్గొన్నారు






