TG20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ విధ్వంసం.. నల్గొండ నైట్స్‌పై కిరాక్ విక్టరీ!

posted on: Jun 23, 2026 11:33AM

తెలంగాణ క్రికెట్ ప్రియులను ఎంతగానో అలరిస్తున్న టీజీ20 లీగ్ 2026 (TG20 League 2026) లో మరో హై-స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ నమోదైంది. నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్ జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో రంగారెడ్డి రైజర్స్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో దుమ్మురేపింది. నల్గొండ నైట్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని బౌలర్లను ఊచకోత కోస్తూ చేధించిన రంగారెడ్డి రైజర్స్, 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ లీగ్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచింది.

ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ నైట్స్ జట్టుకు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు గౌరవ్ రెడ్డి సున్నా (0) పరుగులకే వెనుతిరగగా, ప్రణవ్ సూర్యదేవర 7 పరుగులు, అర్ఫాన్ అహ్మద్ 7 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ రాహుల్ బుద్ధి 30 పరుగులు, వరుణ్ గౌడ్ 26 పరుగులు, మరియు పాట్కూరి నితీశ్ రెడ్డి 20 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన దివేశ్ సింగ్ కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో విలువైన 48 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఆఖర్లో హర్షవర్థన్ సింగ్ సైతం కేవలం 20 బంతుల్లోనే 40 రన్స్ చేసి మెరుపులు మెరిపించడంతో నల్గొండ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

రంగారెడ్డి రైజర్స్ బౌలర్లలో పున్నయ్య అద్భుతమైన స్పెల్‌తో చెలరేగి ఏకంగా 3 వికెట్లు పడగొట్టి నల్గొండ నైట్స్‌ను దెబ్బతీశాడు. అతనికి తోడుగా నితిన్ సాయి యాదవ్ 2 వికెట్లు, ఆర్యన్ చరియప్ప 2 వికెట్లతో రాణించి నల్గొండ భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశారు. కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ సైతం బౌలింగ్‌లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అనంతరం 190 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్‌కు ఓపెనర్ ఆదిత్య జవ్వాజి గట్టి పునాది వేశాడు. ఆదిత్య 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి పవర్‌ప్లేను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత అసలైన విద్వంసం మొదలైంది. రంగారెడ్డి జట్టు కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తూ నల్గొండ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తనయ్ కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు, ఏకంగా 5 భారీ సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు కిరాక్ విక్టరీని అందించాడు.

చివర్లో అవినాష్ రావు కేవలం 6 బంతుల్లోనే ఒక ఫోర్, 3 సిక్సర్లతో 22 రన్స్ చేసి 360 పైగా స్ట్రైక్ రేట్‌తో నల్గొండ బౌలర్లను బెంబేలెత్తించాడు. అతడితో పాటు నితిన్ సాయి యాదవ్ సైతం 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి మెరుపుల సాయంతో రంగారెడ్డి రైజర్స్ నల్గొండ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఊదేశారు. నల్గొండ బౌలర్లలో అనికేత్ రెడ్డి 2, వరుణ్ గౌడ్ 2, నిశాంత్ ఒక వికెట్ తీసినప్పటికీ రంగారెడ్డి రైజర్స్ విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన తనయ్ త్యాగరాజన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...