Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం.. కోహెడ సభలో రేవంత్ ఫైర్
posted on: Jun 6, 2026 8:53PM

రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా రైతులే పండ్లు, కూరగాయలు, పాలు అందించేవారని, రియల్ ఎస్టేట్ విస్తరణతో వ్యవసాయం క్షీణించిందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగినా, నగర అవసరాలను తీర్చేందుకు మరింత మౌలిక సదుపాయాలు అవసరమని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో 240 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ను నిర్మిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ నుంచే మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమవాలని, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని, కందుకూరు ప్రాంతంలో టమోటా ఆధారిత సాస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, వరంగల్-ఆదిలాబాద్ విమానాశ్రయాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని సీఎం విమర్శించారు. "అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు" అని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా సీఎం తీవ్ర విమర్శలు చేశారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రస్తుతం "కూలేశ్వరం"గా మారిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, 15 లక్షల కొత్త రేషన్ కార్డులు, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. మహిళలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. మెట్రో విస్తరణ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంతోనూ పోరాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నప్పటికీ, రోజుకు 18 గంటలు పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.






