రియల్ లైఫ్‌లో రీల్ సీన్... ఐటీ సోదాల్లో బయటపడిన సీక్రెట్

posted on: Feb 20, 2026 9:00PM

 

రీల్ సీన్.. అదేనండి సినిమాల్లో కనిపించే సీన్ రియల్‌గా జరిగితే ఎలా ఉంటుంది?  తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో రియల్‌గా జరిగిన అలాంటి సీన్ చూసి ఇన్‌కం టాక్స్ అధికారులకే దిమ్మతిరిగిందంట. వారి సోదాలో ఓ వ్యాపారి ఇంట్లోని గోడ వెనుక రూ.కోట్ల విలువచేసే బంగారాన్ని దాచిన స్ట్రాంగ్‌ రూమ్ బయటపడింది. ఇదంతా చూసి ఐటీ సోదాలకు వచ్చిన అధికారులు కూడా షాకయ్యారు. రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగవేత ఆరోపణల్లో భాగంగా కన్హా గ్రూప్‌ ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 

ప్రముఖ ఫుడ్‌ అండ్ బెవరేజ్‌ సంస్థ కన్హా గ్రూప్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఐటీ అధికారులు.. కన్హా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఆరు నగరాల్లో ఉన్న 33 ప్రాంతాల్లో ఈ నెల ఫిబ్రవరి 18 నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. జైపూర్‌లో అత్యధిక సంఖ్యలో దాడులు జరిగాయి.  తొలి రెండు రోజుల్లో గ్రూప్‌ యజమాని ఇల్లు, ఆఫీస్‌ల్లో పలు దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మూడో రోజైన శుక్రవారం నాటి సోదాల్లో అధికారులు సీక్రెట్ వాల్‌ను గుర్తించారు. దాన్ని బద్దలుకొట్టి చూడగా.. వెనక ఒక రహస్య గది ఉంది. 

అందులో కోట్ల విలువచేసే బంగారు నగలు ఉన్నాయి. అంతేకాక రూ.50 లక్షల నగదు కూడా లభ్యమైంది. ప్రస్తుతం ఆ గది నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని లెక్కిస్తున్నారు. భారీగా వెలుగు చూసిన ఈ నల్ల ధనం.. దర్యాప్తు తీరునే మార్చి వేయనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ గ్రూప్‌నకు చెందిన పది బ్యాంక్‌ లాకర్లు బయటపడ్డాయి. వాటిలో కూడా లెక్కలోకి రాని నగదు, బంగారం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

2008లో ఈ కన్హా గ్రూప్‌ను నట్వర్‌లాల్ శారదా స్థాపించారు. ఈ సంస్థ స్వీట్స్, బేకరీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. దీని యజమానులు రూ.100 కోట్ల వరకు పన్ను ఎగవేతకు పాల్పడి, ఆ మొత్తాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ హోటళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల వేళ కూడా ఈ గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో వాటిని కొనసాగించేందుకు అధికారులు అనుమతించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...