Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోదావరి వంతెనపై నుంచి దూకి ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం..!
posted on: Aug 17, 2026 2:31PM

పిఠాపురం ఏఈ నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!
రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక అధికారి, తన కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రి వేళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమాచారం ప్రకారం, పిఠాపురానికి చెందిన ఏఈ టి. నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) ఐదో తరగతి చదువుతున్న మనవడు కార్తికేయలు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేసారి బ్రిడ్జి పైనుంచి నీటిలోకి దూకారు. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నలుగురూ నీటిలో కొట్టుకుపోయారు.
ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి, ఈత వస్తుండటంతో నీటిపై తేలుతున్న బాలుడు కార్తికేయను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది మత్స్యకారులతో కలిసి గోదావరిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం నది నలుమూలలా వెతుకుతున్నారు.
అధికారి నూకరాజు రాసిన మరణ వాంగ్మూలం లేఖ లభ్యమవ్వడంతో ఈ వ్యవహారం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. కొద్దినెలల క్రితం అల్లుడు మరణించిన తర్వాత, వారి కుటుంబానికి ఓ వ్యక్తి ద్వారా ఎదురైన తీవ్రమైన ఆర్థిక మోసాలు, బెదిరింపులు వేధింపులే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కుటుంబానికి చెందిన బ్యాంక్ ఖాతాలు, విలువైన పత్రాలను సదరు వ్యక్తి తన ఆధీనంలో ఉంచుకుని నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, వేధింపులు తట్టుకోలేకనే ఈ అడుగు వేయాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఉద్యోగ విరమణకు దగ్గరపడిన ఓ బాధ్యతాయుతమైన అధికారి కుటుంబం ఇలాంటి పరిస్థితికి నెట్టబడటం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసపూరిత వేధింపులపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. లేఖలోని ఆరోపణల ఆధారంగా ప్రధాన అనుమానితుడిపై నిఘా ఉంచి విచారణ వేగవంతం చేస్తున్నారు. గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతుండగా, త్వరలోనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని గుర్తించి, రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించాలని సూచించారు.ఈ ఘటనపై తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో పవన్ కల్యాణ్ ఫోన్లో మాట్లాడారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఘటన నుంచి బయటపడిన నూకరాజు మనుమడి ఆరోగ్య పరిస్థితిపై కూడా పవన్ కల్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి అవసరమైన వైద్య సాయం అందించి, పూర్తిస్థాయిలో కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. క్షణికావేశం, మానసిక ఒత్తిడికి లోనై ఎవరూ ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెదిరింపులు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులను సంప్రదించి చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. ప్రాణం ఎంతో అమూల్యమైందని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Rajahmundry Godavari suicide, Pithapuram AE Nukaraju, Rajahmundry bridge incident, Andhra Pradesh crime news, East Godavari district news






