కోస్తాలో వానలు.. రాయలసీమలో భానుడి భగభగలు.. విలక్షణంగా ఏపీలో క్లైమేట్!
posted on: Mar 17, 2026 9:22AM

వాతావరణ మార్పు.. రాష్ట్రంలో ఒకే సమయంలో ఒక ప్రాంతంలో ఎండ, మరో ప్వారాంతంలో వాన విస్మయం, ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విలక్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని ఓ ప్రాంతం వానలు, మరో ప్రాంతం భానుడి భుగభగలతో నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ వరకు భిన్న వాతావరణం ఉంది. ఇక వివరాల్లోకి వెడితే.. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో మార్చి రెండో వారంలోనే రోళ్లు పగిలే ఎండలు మండిపోతున్నాయి.
అనంతపురం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం (మార్చి 16) జిల్లాలో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడి, ఉక్కపోతతో సీమ జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి ఆరంభంలోనే.. అంటే వేసవి మొదటిలోనే ఈ స్థాయిలో ఎండలు మండిపోతుంటే రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు ఇంకెంత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదే సమయంలో కోస్తా జిల్లాలలో వాతావరణం చల్లగా మారింది. వాతావరణ శాఖ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలులు, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో మంగళవారం(మార్చి 17) వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల పిడుగుపాటుకు కూడా అవకాశం ఉందని హెచ్చరించింది.






