గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!

posted on: Jun 6, 2026 3:41PM

భారత  దక్షిణ సరిహద్దుల్లో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, పర్యావరణ దుమారాన్ని రేపుతోంది. నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ. 81,000 కోట్ల భారీ వ్యయంతో ఈ ద్వీపంలో ఒక అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, సివిల్ మరియు మిలిటరీ అవసరాల కోసం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్,  అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించింది. మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల చైనా వ్యూహాత్మక ఆధిపత్యానికి గట్టి అడ్డుకట్ట వేయడానికి..  అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే  అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వివాదాస్పద ద్వీపాలను స్వయంగా సందర్శించి..  అక్కడ సముద్రంలోకి ప్రత్యేకంగా డైవింగ్ చేసి అక్కడి పర్యావరణాన్ని నిశితంగా పరిశీలించిన రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక వీడియోను   విడుదల చేశారు. దేశ రక్షణ, అంతర్జాతీయ ఓడరేవు అనేవి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పచ్చి అబద్ధాలని..  నిజానికి రక్షణ అవసరాలే ఉంటే అక్కడ ఇప్పటికే ఉన్న మిలిటరీ బేస్ ఐఎన్ఎస్ బాజ్ ను మరింత విస్తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం రక్షణ దళాల వెనుక దాక్కుని దేశ అమూల్యమైన భూములను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లింక్‌ను రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తూ..  ఈ మెగా ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది కేవలం అదానీ మాత్రమేనని ఆరోపించారు. భారతదేశపు అత్యంత అరుదైన పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, కేవలం ఒక వ్యాపారవేత్త కోసం అక్కడ లగ్జరీ హోటళ్లు, క్యాసినోలు,  రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని రాహుల్ ఆరోపించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది అడవులను  నరికివేసి, ఆ విలువైన కలపను అక్రమంగా తరలించి కోట్లాది రూపాయల వ్యాపారం చేసే పెద్ద స్కెచ్ దీని వెనుక ఉందని ఆరోపించారు.  
పర్యావరణ పరంగా చూస్తే ఈ ప్రాజెక్టు వల్ల గ్రేట్ నికోబార్ ద్వీపానికి కోలుకోలేని శాశ్వత నష్టం వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సుమారు 130 చదరపు కిలోమీటర్ల మేర దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలను పూర్తిగా తొలగించాల్సి వస్తుందని, దీనివల్ల దాదాపు 1.5 కోట్లకు పైగా అత్యంత అరుదైన వృక్షాలు నరికివేతకు గురవుతాయని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన సుందాలాండ్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లో ఈ ద్వీపం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ ఓడరేవు నిర్మాణం చేపట్టడం వల్ల సముద్ర గర్భంలో శతాబ్దాలుగా పెరుగుతున్న సజీవ పగడపు దిబ్బలు అంతరించిపోతాయని, అంతరించిపోతున్న అరుదైన లెదర్‌బ్యాక్ సముద్ర తాబేళ్ల ప్రధాన సంతానోత్పత్తి కేంద్రమైన గలాథియా బే పూర్తిగా కలుషితమైపోతుందని పర్యావరణ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

కేవలం ప్రకృతికే కాకుండా, తరతరాలుగా అక్కడ నివసిస్తున్న షోంపెన్, నికోబారీస్ వంటి ప్రాచీన ఆదిమ గిరిజన తెగలను, అలాగే దేశం కోసం ప్రాణాలర్పించి అక్కడ స్థిరపడిన మాజీ సైనికుల కుటుంబాలను ఫారెస్ట్ రైట్స్ యాక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించి అక్రమంగా వారి సొంత భూముల నుండి ఖాళీ చేయిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ శతాబ్దాల నాటి అడవులను దారుణంగా నరికేసి, దానికి పరిహారంగా ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్తగా మొక్కలు నాటుతామనడం పర్యావరణాన్ని, ప్రకృతిని దారుణంగా అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఆన్‌లైన్ పిటిషన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించడంతో, ఈ గ్రేట్ నికోబార్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...