మోడీకి భయపడి సిద్దూ వెనుక దాక్కొన్న రాహుల్..

posted on: Jun 10, 2016 2:33PM

ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి ఫుల్‌టైమ్ సారథిగా సోనియా గాంధీ బాధ్యతలు అప్పగించబోతున్నారని దేశం మొత్తం ప్రచారం జరుగుతోంది. మరోపక్క రాజకీయాల్లో ఓనమాలు తెలియని రాహుల్ ప్రధాని మోడీ ముందు నిలబడలేరని మరో వాదన వినబడుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ కార్టూనిస్ట్ వేసిన కార్టూన్ ఇప్పుడు కన్నడ నాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉడిపి జిల్లాకు చెందిన సతీష్ ఆచార్య అనే కార్టూనిస్ట్ కార్టూన్ కార్నర్ పేరుతో ఓ హోర్డింగ్ ఉంచారు. అందులో తాను గీసే ప్రతి కార్టూన్‌ను ఉంచడం ఆయనకు అలవాటు. అలాగే తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీలపై ఓ కార్టూన్ గీశారు. ఆ కార్టూన్‌లో మోడీ తనను పట్టుకోవడానికి వస్తుంటే రాహుల్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెనుక దాక్కున్నట్టుగా చిత్రీంచారు.

 

అంతే అసలే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం కావడంతో ఉలిక్కిపడిన అధికారులు దానిని వెంటనే తొలగించారు. దీనిపై అధికారులను ఆరా తీసిన సతీష్ ఆచార్య పట్ణణ సుందరీకరణలో భాగంగా హోర్డింగ్స్, బిల్‌బోర్డ్స్ తొలగించామని, ప్రత్యేకంగా ఆ కార్టూన్‌నే తీసివేయలేదని చెప్పుకొచ్చారు. తాను అన్ని పార్టీల మీద కార్టూన్లు వేస్తానని, కానీ గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన చెప్పారు. అయితే ఆయన గీసిన కార్టూన్‌లో దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను బ్లూ కలర్‌లో వేసి చివర్లో కాంగ్రెస్ ముక్త భారత్ అని రాశారు.

హస్తం అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక కావడం..గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకోవడంతో తిరిగి పవర్ లాక్కోవడానికి కర్ణాటకపై కమలం కాన్సన్‌ట్రేషన్ చేసింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఈ కార్టూన్ కర్ణాటక కాంగ్రెస్‌ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. అందుకు నిదర్శనంగా ఈ కార్టూన్ వేసిన వెంటనే ఓ స్థానిక కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆచార్యకు ఫోన్ చేసి అలాంటి కార్టూన్ వేయడం తప్పని, దానిని వెంటనే తొలగించాలని బెదిరించినట్లు సతీశ్ వెల్లడించారు. కాంగ్రెస్ తన ముందున్న సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి గానీ..ఇలా కార్టూన్లను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...