రాహుల్‌ రూటే సపరేటు!

posted on: Feb 13, 2016 5:36PM

రోహిత్ వేముల ఆత్మహత్య తరువాత హుటాహుటిన హైదరాబాదుకి ప్రత్యేక విమానంలో వచ్చి, సెంట్రల్‌ యూనివర్శటీ విద్యార్థులకు తన సానుభూతులను అందచేశారు రాహుల్. జాతిపిత గాంధిలాగానే రోహిత్‌ కూడా సంఘవిద్రోహ శక్తుల చేతిలో హతమయ్యారని వాపోయారు. ఇప్పుడు అదే రాహుల్‌ దిల్లీలో తన సానుభూతులను తెలియచేసేందుకు సిద్ధపడుతున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పాకిస్తాన్‌కీ, తీవ్రవాది అఫ్జల్ గురుకి అనుకూలంగా కొందరు విద్యార్థులు నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఆ వివాదానికి కారణమైన విద్యార్థులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇప్పడు వారందరికీ తన మద్దతును తెలిపేందుకు రాహుల్‌ గాంధి బయల్దేరుతున్నారట. ఈ దేశంలో అందరికీ భావస్వేచ్ఛ ఉందనీ, దానిని ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందనీ రాహుల్‌ ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆ భావస్వేచ్ఛ తీవ్రవాదులనీ, వారిని ప్రోత్సహించే దేశాలనీ పొగిడే స్థాయికి చేరుకుందని దిల్లీ సంఘటనతో దేశ ప్రజలకు దిమ్మతిరిగేలా అర్థమైంది. ఇలాంటి సందర్భంలో ఆచితూచి స్పందించాల్సిన రాహుల్‌ బాబు పోయి పోయి పాకిస్తాన్‌ భజనపరులకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారేమిటా అని కాకలు తీరిన కాంగ్రెస్ నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి విలక్షణమైన పనులను చేయడంలో రాహుల్‌ గాంధి దిట్ట కదా! ఆయనను భావి ప్రధానిగా కొలుచుకుంటున్నవారికి ఆ విషయం తెలియదా ఏం?

google-ad-img
    Related Sigment News
    • Loading...