ఆనాటి పుత్తడి బొమ్మ పూర్ణమ్మలా.. నేటి పుత్తూరు పద్మ!
posted on: Feb 9, 2026 11:18AM
గురజాడ అప్పారావుగారు రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మలో నలుగురు కూడే చోట నన్నొక పరి తలవండీ అంటుంది పూర్ణమ్మ. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నాడు సాగిన మహోద్యమానికి గురజాడ పాట పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఎంతగానో దోహదపడింది.
ఇప్పుడు తాజాగా పుత్తూరుకు చెందిన పద్మ కూడా ఇలాగే ఒక లేఖ రాసింది. ఆ లేఖలో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకునేవారు నన్నొక పరి తలవండీ అంటూ ఎంతో దు:ఖంతో ఉద్వేగ భరితంగా లేఖ రాసి, తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది.
ఎనిమిదేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి శివశంకర్ రావు అనే యువకుడ్ని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న పద్మ.. కాపురం కష్టాల కడలిలా సాగింది. తరచూ గొడవలతో రచ్చరావిడిగా మారింది. సంసారం నడపాలి. నెలకు సరిపడా సరుకులు తెచ్చుకోవాలి. డబ్బులు ఇవ్వమంటే ఎంతకీ ఇచ్చేవాడు కాదు.. ఆమె ప్రేమించి మరీ పెళ్లాడిన భర్త శివశంకర్. అలాగే పనికి పోయేవాడు కాదు. దీంతో శివశంకర్ రావుతో పద్మకు ఎప్పుడూ గొడవే. ఇదే విషయాన్ని పద్మ తన లేఖలో ప్రస్తావించింది. ఒక భర్తలో ఏయే దుర్గుణాలు ఉండకూడదని ఒక ఆడపిల్ల భావిస్తుందో ఆ దుర్గుణాలన్నీ తన భర్త శివశంకర్ లోర్లో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొందామె.
ఇదంతా ఇలా ఉంటే.. ఆమె తన భర్తకు ఒక సూచన కూడా చేసింది. నేను, నా పిల్లలు వెళ్లిపోయాక.. ఎలాగూ బెయిలుపై బయటకొచ్చి ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకుంటావు. అప్పుడు కూడా ఇలాగే ఏ పనీ పాట లేకుండా ఉండకు. ఒక మంచి పనిలో కుదిరాక పెళ్లి సంబంధం కుదుర్చుకో. ఎందుకంటే నాలా ఏ ఆడపిల్ల కూడా బాధ పడకూడదంటూ ఆమె తన లేఖలో పేర్కొంది. ఇప్పుడున్న జమానాలో యువకులు లైఫ్ లో సెట్ కాకుండా పెళ్లి చేసుకోకూడదని గట్టిగా ఫిక్సయిన మాట నిజం. ఐదెంకెల జీతం, ఫ్లాటూ, కారు.. అమర్చుకునే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ అమరే సరికి వారికి నలభై ఏళ్లు వచ్చేస్తున్నాయ్. దీంతో లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారు.
ఇటు చూస్తే శివశంకర్ రావులా తెలిసీ తెలియని వయసులో పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలాంటి దారుణమారణకాండకు కారకులు కావల్సి వస్తోంది. ఏది ఏమైనా పద్మ- శంకర్ రావుల ప్రేమ- పెళ్లి- ఆత్మహత్యల వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ప్రేమలో పడి తల్లిదండ్రులను ఎదిరించి కులాంతర వివాహాలు చేసుకునే వారు నన్నొక పరి తలవండి! అంటూ పద్మ రాసిన ఈ లేఖ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. పద్మ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్ల సర్వత్రా విచారం వ్యక్తం అవుతోంది.



.webp)


