TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్... 525 కిలోలు స్వాధీనం

Published on: Tue Jun 30, 2026 5:24PM

 

పుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయిని దాచిపెట్టి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రవాణా ముఠాను తెలంగాణ ఈగిల్ ఫోర్స్ (EAGLE), ఖమ్మం ప్రాంతీయ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ (RNCC), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.

సారపాకలోని ఐటీసీ పేపర్స్ బోర్డ్ పశ్చిమ గేట్ సమీపంలో కంటైనర్‌ను అడ్డగట్టి తనిఖీలు నిర్వహించగా, ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరలో దాచిన రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయి బయటపడింది. కంటైనర్‌కు ఎస్కార్ట్‌గా వెళ్తున్న బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో 525 కిలోల గంజాయితో పాటు కంటైనర్ లారీ, బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.10,570 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా సిందూర్‌పల్లికి చెందిన గంజాయి సరఫరాదారు సహదేవ్ హంటల్ (20), ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి చెందిన దోగ్రి త్రినాథ్ (38), ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటైనర్ డ్రైవర్ కుల్దీప్ శర్మ (27)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో బాలుడిని (CCL) జువెనైల్ చట్టాల ప్రకారం అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ట్రక్ యజమాని మహ్మద్ సైఫ్‌తో పాటు ఫిరోజ్ భాయ్, రాజా మిశ్రా, మహ్మద్ ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.