దేవాన్ష్ పేరుతో పుష్కర ఘాట్... లోకేశ్ సీరియస్

posted on: Jun 6, 2026 5:04PM

 

టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు. ఏపీలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఓ ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పేరు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై  లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తూ, ఆ పేరును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

 ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి తగవని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం మునికూడలిలో గోదావరి పుష్కరాల కోసం ఘాట్‌ను సిద్ధం చేస్తున్నారు.  రాజానగరం నియోజకవర్గంలోని గౌతమీ, వశిష్ట, లక్ష్మీ నదుల పవిత్ర సంగమమైన 'మునికూడలి' వద్ద  ఘాట్‌ను సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. 

ఆ ఘాట్‌కు 'దేవాన్ష్ ఘాట్' అని పేరు పెట్టారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ఘాట్‌ను పరిశీలించిన సమయంలో అక్కడ దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం కుటుంబ సభ్యుడి పేరు పెట్టడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అది లోకేశ్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఏ ఘాట్‌కు కూడా దేవాన్ష్ పేరు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...