కాబోయే భార్యే లోయలోకి నెట్టేసింది..పుణే ట్రెక్కర్ మర్డర్ పక్కా ప్లాన్!

posted on: Jun 23, 2026 2:43PM

 

మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్‌ కోట పర్యాటక ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడనుకున్న ఘటన.. పక్కా ప్రణాళికతో జరిగిన ఘోర హత్యగా పోలీసులు తేల్చారు. కాబోయే భర్తను ఆ యువతే తన స్నేహితుడితో కలిసి లోయలోకి నెట్టేసిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

పుణే సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్‌ విశాల్‌ అగర్వాల్‌ తమ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి ఆమెతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లోహగఢ్‌ కోట వద్దకు ట్రెకింగ్‌కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతైన లోయలో పడి కేతన్‌ మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి.

ఘటనా స్థలంలో బలమైన గాలులు వీస్తుండటం వల్ల, కాబోయే భార్యను ఫోటోలు తీసే క్రమంలో కేతన్ అదుపు తప్పి కిందకు పడిపోయాడని అప్పట్లో కేసు నమోదు చేశారు. లోనావాలా రూరల్ పోలీసులు, స్థానిక శివదుర్గ్ మిత్ర రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించి లోయ నుంచి అతని మృతదేహాన్ని వెలికితీశారు. కానీ, ఈ క్రమంలో పోలీసులు జరిపిన లోతైన విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

కేతన్ మొబైల్ ఫోన్ రికార్డులు, ఘటనా స్థలంలో ఉన్న ఇతరుల సాక్ష్యాలను పరిశీలించిన పోలీసులకు బలమైన ఆధారాలు లభించాయి. నిందితురాలైన యువతికి ఈ వివాహం ఇష్టం లేదని, అందుకే తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను కొండపైకి తీసుకువెళ్లిందని సమాచారం. అనంతరం ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఏమార్చి, తన మగ స్నేహితుడితో కలిసి అతడిని లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దారుణ ఉదంతం ఇరు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేతన్, సదరు యువతికి ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక ప్యాలెస్‌ను కూడా పెళ్లి వేడుకల కోసం కుటుంబ సభ్యులు బుక్ చేశారు. అంతలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా కాబోయే భార్య చేతిలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.

ప్రస్తుతం పోలీసులు నిందితురాలైన యువతిని, ఆమెకు సహకరించిన మగ స్నేహితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి గల పూర్తి కారణాలు, వారి మధ్య ఉన్న ఇతర సంబంధాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...