శిధిలాల కింద నుంచి 96 గంటల తరువాత ప్రాణాలతో బయటకి!

posted on: Jun 29, 2026 9:14AM

 

ప్రకృతి ప్రకోపానికి ఆ  అల్లకల్లోలమైపోయిన వెనిజువెలా ప్రస్తుతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా కూలిన భవనాలు, కాంక్రీట్ దిబ్బలు, గుండెలు పగిలేలా ఏడుస్తున్న బాధితుల రోదనలు మాత్రమే కనిపిస్తున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన ఈ ఘోర భూకంపం సృష్టించిన ప్రళయంలో  1,450 మందికి పైగా   ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకుపోయారు.  

50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.  భూకంపం సంభవించి నాలుగు రోజులు గడిచిపోవడంతో శిధిలాల కింద ఎవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని అంతా ఆశలు వదిలేసుకుంటున్న వేళ..  మరణం అంచుల్లో నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 96 గంటలు శిధిలాల కింద చిక్కుకుపోయిన తండ్రీ కొడుకులు ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతంగా జనం భావిస్తున్నారు. సాధారణంగా  భూకంపం సంభవించిన   మొదటి 72 గంటలను  గోల్డెన్ అవర్స్‌గా భావిస్తారు. ఈ 72 గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న మనుషులు ప్రాణాలతో బతికే అవకాశాలు దాదాపు శూన్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ, ఆ కాలపరిమితిని సైతం అధిగమించి, ఏకంగా 96 గంటల పాటు చావుతో పోరాడి ఆ తండ్రీకొడుకులు ప్రాణాలను నిలుపుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌లో అంతర్జాతీయ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్రాన్స్, అమెరికా దేశాలకు చెందిన ప్రత్యేక రెస్క్యూ బృందాలు అత్యాధునిక సాంకేతిక పరికరాలతో లా గుయ్‌రాలో గాలింపు చర్యలు చేపట్టాయి. వారు ఉపయోగించిన అడ్వాన్స్‌డ్ కెమెరాలు, లైఫ్ డిటెక్టర్ పరికరాల సహాయంతో ఒక భారీ కాంక్రీట్ దిబ్బ కింద జీవకళ ఉన్నట్లు గుర్తించారు. లోపల ప్రాణాలతో  ఉన్నారని తెలియగానే రెస్క్యూ  అత్యంత జాగ్రత్తగా శకలాలను తొలగిస్తూనే, మరోవైపు లోపలికి ఐవీ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ ద్రవాలను పంపేందుకు ఏర్పాట్లు చేశారు. చీకటి గుహలాంటి ఆ శిథిలాల గుండా పైపుల ద్వారా ద్రవాలను అందిస్తూ వారి శరీరంలో జీవశక్తి తగ్గకుండా చూశారు.

దాదాపు 12 గంటల పాటు అత్యంత క్లిష్టంగా, ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. ఆదివారం నాడు ఆ తండ్రీకొడుకులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. 96 గంటల పాటు నరకయాతన అనుభవించిన ఆ ఇద్దరూ తీవ్రమైన అలసట, డీహైడ్రేషన్‌తో స్పృహతప్పే స్థితిలో ఉన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర అత్యంత నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. కేవలం ఈ ఇద్దరే కాకుండా, శని, ఆదివారాల్లో నిర్వహించిన ముమ్మర రెస్క్యూ ఆపరేషన్లలో అంతర్జాతీయ బృందాలు మొత్తం 33 మందిని వివిధ ప్రాంతాల్లో శిథిలాల కింద నుండి ప్రాణాలతో కాపాడాయి. ఈ అద్భుత రెస్క్యూ ఘటనలతో బాధితుల కుటుంబాల్లో   అక్కడ శ్రమిస్తున్న సహాయక సిబ్బందిలో కొత్త ఆశలు చిగురించాయి. ఇంకా ఎంతో మంది శిథిలాల కింద ప్రాణాలతో ఉండే అవకాశం ఉందనే నమ్మకంతో అంతర్జాతీయ బలగాలు ప్రస్తుతం అక్కడ యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...