ప్రేమ, వేధింపులు, మోసం..డ్యాన్సర్ రేణుక జీవిత విషాద గాథ..!

posted on: Jul 5, 2026 1:37PM

 

తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!

నమ్మిన వారి మోసం..ఓ పబ్ డ్యాన్సర్ కన్నీటి గాథ..!

హైదరాబాద్‌లో ఓ యువతి జీవితం విషాదాంతమైంది. చిన్న వయసులో ప్రేమ పేరుతో మొదలైన బంధం.. పెళ్లి తర్వాత భర్త వేధింపులు.. ఒంటరితనం.. నమ్మిన వారి మోసం.. ఇలా వరుసగా ఎదురైన కష్టాలు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి. చివరకు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రాండ్ లాడ్జిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. అల్వాల్‌కు చెందిన రేణుక (26) చిన్నతనంలోనే చదువు మానేసి ఉపాధి కోసం ఓ హోటల్‌లో పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో పాతబస్తీకి చెందిన శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారడంతో పదేళ్ల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 

పెళ్లి తర్వాత రేణుక గర్భం దాల్చగా.. పిల్లలు వద్దని, అబార్షన్ చేయించుకోవాలని భర్త ఒత్తిడి చేశాడు. అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలని నిర్ణయించుకున్న రేణుక భర్తకు దూరంగా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విడిపోయిన తర్వాత తల్లిదండ్రులు కూడా దూరం పెట్టడంతో.. కొడుకును పోషించేందుకు గత నాలుగేళ్లుగా కూకట్‌పల్లి లోని ఓ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో గోల్కొండకు చెందిన ఫారూఖ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు అండగా ఉంటానని నమ్మించిన ఫారూఖ్‌తో ఆమె సన్నిహితంగా మెలిగింది. అయితే తనను పలువురు కేవలం ఉపయోగించుకుని మోసం చేస్తున్నారనే భావనతో రేణుక తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. 

తన మానసిక బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని స్నేహితులతో తరచూ చెప్పేదని విచారణలో వెల్లడైంది. జులై 2న రేణుక, ఫారూఖ్ కలిసి లంగర్‌హౌస్‌లోని గ్రాండ్ లాడ్జిలో గది తీసుకుని మద్యం సేవించారు. రాత్రి ఫారూఖ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న రేణుక అర్ధరాత్రి తన స్నేహితురాలు సత్యవాణికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. మొదట ఆమె మాటలను సీరియస్‌గా తీసుకోని సత్యవాణి.. అనంతరం వీడియో కాల్‌లో ఫ్యాన్‌ను చూపిస్తూ "నేను చనిపోతు న్నాను" అని చెప్పడంతో వెంటనే ఫారూఖ్‌కు సమాచారం ఇచ్చింది. 

హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారూఖ్.. రేణుక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించాడు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా రేణుక మరో ఏడుగురు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేశారా.. లేక మానసికంగా వేధించారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. స్నేహితురాలు సత్యవాణి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తున్నారు. రేణుక జీవితం విషాదాంతం కావడంతో ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు తల్లిని కోల్పోయి అనాథగా మిగిలాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...