ఖమేనీ మృతితో భారత్, పాక్‌లలో నిరసనలు

posted on: Mar 1, 2026 4:50PM

ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మృతికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో నిరసనలు హోరెత్తాయి. భారత్‌లోని లద్ధాఖ్, పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతాల్లో.. ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో నల్ల జెండాలు పట్టుకుని ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ ప్రదర్శనలు  హోరెత్తాయి.  జమ్ముకశ్మీర్‌ లెహ్‌లోని లద్ధాఖ్ ప్రాంతంలో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇరాన్‌కు సంఘీభావం తెలుపుతూ.. ఖమేనీ చిత్రాలు, నల్ల జెండాలు, ఇరాన్‌కు మద్దతిచ్చే బ్యానర్లతో ఈ నిరసనలు చేపట్టారు.  

పాకిస్థాన్‌లోనూ ఇరాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ మద్దతుదారులు మూకుమ్మడిగా కర్రలు, రాళ్లతో అమెరికన్ కాన్సులేట్ భవనంపై దాడికి దిగారు. అక్కడి పలు భవనాలకు నిప్పంటించినట్టు సమాచారం. అయితే.. ఆందోళనకారులను అడ్డుకోవడంలో భాగంగా భద్రతా సిబ్బంది కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో పలువురు నిరసనకారులు మృతిచెందినట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ఖమేనీ మరణం పట్ల సంతాపం తెలిపేందుకు మధ్య ఇరాన్‌లోని ఇస్‌ఫహాన్ నగర ప్రజలు ఇమామ్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు. వారంతా సమూహంగా ఏర్పడి దివంగత సుప్రీం లీడర్‌కు సంతాపం తెలిపారని అక్కడి ఇస్లామిక్ రిపబ్లిక్ వెల్లడించింది. అలాగే ఇరాన్ ఈశాన్య నగరమైన మషాద్‌లోని ఇమామ్ రెజా మందిరం వద్ద కూడా ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్.. దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ప్రకటించింది. ఈ సందర్భంగా ఖమేనీకి సంతాపం తెలుపుతూ.. ఆ దేశంలో సగం ఎత్తులో జెండాలను ఎగురవేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో 37 ఏళ్ల అధ్యాయానికి తెరపడిందని ప్రజా సమావేశాలు ఏర్పాటుచేసి నివాళులర్పించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...