ఆ బీజేపీ లీడర్ ‘బ్యాన్’ చేయాల్సిందే అంటున్నాడు! గోమాంసం కాదు!
posted on: Jul 1, 2017 12:10PM

దేశంలో ఒక వైపు బీఫ్ తింటున్నారని ఆరోపిస్తూ అనేక చోట్ల హత్యలకి తెగబడుతున్నారు అరాచకవాదులు. దీన్ని తమ రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటున్న ప్రతిపక్షాలు అవ్వి కేవలం ముస్లిమ్ మైనార్టీల్ని టార్గెట్ చేసి జరుపుతోన్న దాడులకి అంటున్నాయి. మరికొన్ని పార్టీలు దళితుల్ని కూడా కాషాయ శక్తులు భయపెడుతున్నాయని అంటున్నాయి. ఇదంతా ఒక గందరగోళం అయితే మరో గందరగోళానరికి తెర తీసే ప్రయత్నంలో వున్నారు ఇంకో బీజేపి నేత! ఆయన గోమాంసం నిషేధం కాక మరో తినుభండారం బ్యాన్ చేయాలంటున్నారు! అదే మోమో!
మోమో అంటే ఏంటి అంటారా? ఉత్తర భారతదేశంలో దొరికే ఒక రకమైన స్ట్రీట్ ఫుడ్! మరీ ముఖ్యంగా జమ్ములో వీధి వీధినా మోమోలు అమ్ముతుంటారు. మన దగ్గర వేడి వేడి మిర్చీలు నూనెలో గోలించి అమ్మినట్టే అక్కడ మోమోలు అమ్ముతుంటారు.అయితే మోమోలు నాన్ వెజ్ తో కూడా తయారు చేస్తారు. పిండిలో రకరకాల మసాలాలు పెట్టి నూనేలో వేపుతారు! వీట్ని లొట్టలేసుకుంటూ తింటారు లక్షలాది మంది ఉత్తర భారతీయులు. జమ్ములో ఈ మోమో అభిమానులు ఇంకా ఎక్కువ!
ఎంతో మంది ఇష్టపడి తినే మోమోలపై జమ్ములోని ఒక బీజేపి ఎమ్మెల్సీ ఎందుకు కక్షగట్టారు? ఆయన చెబుతోన్న రీజన్స్ కాస్త సీరియస్ గానే వున్నాయి. మోమోల్లో మంచి రుచి రావటం కోసం అజినమోటో అనే పదార్థం కలుపుతారట. ఒక విధమైన విషం లాంటి దీని వల్ల అనేక ఆనారోగ్యాలతో పాటూ క్యాన్సర్ కూడా వస్తుందంటున్నారు రమేష్ అరోరా. బీజేపి ఎమ్మెల్సీ అయిన ఆయన చాలా రోజులుగా మోమోలపై యుద్ధం చేస్తున్నారు. తాజాగా వంద మందిని వెంట పెట్టుకుని జమ్మూలో ర్యాలీ కూడా చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మోమోల్ని నిషేధించే దాకా ఆయన ఊరుకోనని శపథం చేశారు! దిల్లీలో, శ్రీనగర్ లో రెండు చోట్లా రమేష్ అరోరా ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీనే అధికారంలో వుంది కాబట్టి బ్యాన్ చేస్తారో లేదో చూడాలి! కాకపోతే, జనం ఎంతో ఇష్టంగా తినే మోమోలను దొరక్కుండా చేస్తే రియాక్షన్ తీవ్రంగానే వుండే ఛాన్స్ వుంది! ఎందుకంటే, ఇప్పటి వరకూ మోమోల్లో విషతుల్యమైన పదార్థాలు కలుస్తున్నట్టు ఎక్కడా నిరూపితం కాలేదు. మరి అలాంటప్పుడు ఆల్రెడీ గో మాంసం నిషేధంతో గొడవలు ఎదుర్కొంటోన్న కమలదళం కొత్తగా మోమోల వేడిని కూడా కోరి నెత్తిన పెట్టుకుంటుందా? చూడాలి మరి…







.webp)


