లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక గర్జన.. భాగ్యనగరంలో భారీ ర్యాలీ
posted on: Feb 12, 2026 2:39PM
.webp)
కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం అమలు చేయాలని భావిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్ తో జాతీయ స్థాయిలో పది కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు నగరంలో ర్యాలీ నిర్వహించారు భాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు, సంఘాల నాయకులు, అసంఘటిత రంగ ప్రతినిధులు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
గురువారం (ఫిబ్రవరి 12) ఉదయం నుంచే ఆర్టీసీ కళాభవన్ ప్రాంగణం కార్మికులతో కిక్కిరిసిపో యింది. వివిధ రంగాలకు చెందిన కార్మికులు తమ తమ జెండాలు, బ్యానర్లతో అక్కడికి చేరుకున్నారు. ర్యాలీ ఆసాంతం లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి, కార్మిక హక్కులు కాపాడాలి, మోడీ డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగింది. నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా ఉన్నాయని కార్మిక సంఘాల నేతలుఆరోపించారు. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్సహించేలా నిబంధనలు ఉన్నాయని, కార్మికుల హక్కులను ఇవి పరిమితం చేసే ప్రమాదం ఉందని పేర్కొ న్నారు. వేతన భద్రత, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులను కాలరాసే విధంగా ఇవి ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసంఘటిత రంగ కార్మికులు మాట్లాడుతూ ఇప్పటికే తక్కువ వేతనాలు, అస్థిర ఉద్యోగాలతో ఇబ్బందులు పడుతున్నామని, కొత్త కోడ్లు అమల్లోకి వస్తే తమ పరిస్థితి మరింత దారుణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో యూనియన్ ప్రతినిధులు కూడా తమ సమస్యలను ప్రస్తావిస్తూ, కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉండాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. కార్మికుల ఐక్యతే ప్రభుత్వాలకు హెచ్చరిక అని పేర్కొన్నారు. కార్మికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలు తీసుకురావడం తగదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే దేశవ్యాప్తంగా మరింత తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిం చారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.



.webp)


