Latest News

రాజకీయం వల్లే ఆస్తి వివాదాలా...ఆస్తి గొడవలు వెనుక రాజకీయమా?

posted on: Mar 19, 2026 1:15PM

 

వైఎస్ ఫ్యామిలీలో గ‌త కొంత కాలంగా సాగుతోన్న ఆస్తి వివాదం.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం ఇదొక చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అస‌లేంటీ స‌ర‌స్వ‌తి  ప‌వ‌ర్ అండ్ ఇండ‌స్ట్రీస్ వివాదం?  భార‌తీ సిమెంట్ తో పాటు ఇత‌ర  కంపెనీ షేర్ల బ‌దిలీ చుట్టూ ఇదెందుకు తిరుగుతోంది? అని గ‌మ‌నిస్తే.. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిళ వాద‌న‌ల ప్ర‌కారం.. వైయ‌స్ఆర్ బ‌తికి  ఉన్న‌పుడే కుటుంబ  ఆస్తుల‌ను జ‌గ‌న్, షర్మిళ‌కు స‌మానంగా  పంచాల‌ని  ఒక అవ‌గాహ‌న  కుదిరింది.

2019లో జగన్, షర్మిళ‌ మధ్య ఒక ఒప్పందం మెమ‌రాండం ఆఫ్ అండ‌ర్ స్టాండింగ్ కింద‌ కుదిరింది. దీని ప్రకారం కొన్ని ఆస్తులను జ‌గ‌న్, షర్మిలకు బదిలీ చేయాల్సి ఉంది. ఇందులో జ‌గ‌న్ వాద‌న ఎలాంటిదో చూస్తే.. తాను కేవ‌లం  ప్రేమ‌తో మాత్ర‌మే ఆస్తులు ఇస్తాన‌ని అన్నాన‌నీ, కానీ ష‌ర్మిళ రాజ‌కీయంగా త‌న‌ను వ్య‌తిరేకించ‌డం వ‌ల్ల.. ఆ ఒప్పందానికి ఒక విలువ అంటూ లేద‌ని  అంటున్నారాయ‌న‌. అంతే కాదు, ఈడీ  కేసుల వ‌ల్ల ఆస్తులు అటాచ్ మెంట్ లో ఉన్నాయి. కాబ‌ట్టి వాటిని బ‌దిలీ చేయ‌డం  కూడా చ‌ట్ట విరుద్ధంగా చెబుతారాయ‌న‌. ఈ దిశ‌గా ఒక పిటిష‌న్ సైతం వేశారు జ‌గ‌న్.

ఇక  అఫిడవిట్‌లో విజయమ్మ, షర్మిళ‌ చేసిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే.. తాను త‌న‌ కూతురికి బినామీని కాద‌ని అంటారు విజయమ్మ. సరస్వతి పవర్‌లో తనకున్న షేర్లను షర్మిళ‌కు బదిలీ చేసే పూర్తి హక్కు తనకు ఉందని వాదిస్తారామె.కంపెనీలకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను జగన్ వర్గం మాయం చేసిందని, అయినా తాను ప్రత్యామ్నాయ ఆధారాలను కోర్టుకు సమర్పించానని అంటున్నారు విజ‌య‌మ్మ‌. వైఎస్సార్ ఆశయాలకు విరుద్ధంగా, చెల్లికి దక్కాల్సిన వాటాను దక్కకుండా చేసి కంపెనీలన్నింటినీ జగన్, భారతి తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు త‌ల్లి విజ‌య‌మ్మ‌.

ప్రస్తుతం ఈ కేసు.. నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్, దాని అప్పీలేట్ అధారిటీ NCLAT వద్ద విచారణలో ఉంది. జగన్ మోహన్ రెడ్డి తన తల్లి, చెల్లిపైనే కోర్టులో పిటిషన్ వేయడం..  ఈ వివాదాన్ని వ్యక్తిగతం నుంచి చ‌ట్ట‌ప‌రం వ‌ర‌కూ లాక్కెళ్లింది.ప్రస్తుతం షేర్ల బదిలీ ప్రక్రియ.. కోర్టుల పర్యవేక్షణలో ఉంది. అఫిడవిట్ల దాఖలు పూర్తయిన తర్వాత కోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఎవ‌రి పాత్ర ఎంతెంత‌? త‌ప్పు ఎవ‌రిది? అని ప‌రిశోధిస్తే.. ఇది పూర్తిగా ఆధారాలు, ఒప్పందాల మీద ఆధారపడి క‌నిపిస్తోంది. 

త‌న సొంత త‌ల్లి, చెల్లిపై కోర్టుకు వెళ్ల‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ఆయ‌న‌కిది  ఒక మైన‌స్ గా మారింది. ఒప్పందం  చేసుకున్నాక వెన‌క్కి త‌గ్గ‌డం స‌రైనది కాదంటున్నారు చాలా మంది. అయితే, ఇందుకు వివ‌ర‌ణ  ఇస్తున్న ఆయ‌న‌.. ఆస్తుల బ‌దిలీ చేస్తే బెయిల్ ర‌ద్ద‌య్యే ప్రమాద‌ముంది. కాబ‌ట్టి  చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్తుతాయి. అందుకే ఆపుతున్న‌ట్టు చెబుతున్నారు జ‌గ‌న్.

కుటుంబ గౌర‌వం కోసం  ఇన్నాళ్లూ తాను మౌనం పాటించాన‌ని అంటారు త‌ల్లి విజ‌య‌మ్మ‌. ఇప్పుడు నేరుగా అఫిడ‌విట్ వేయ‌డం ద్వారా త‌న స‌పోర్టు త‌న కుమార్తె ష‌ర్మిళ‌కేనంటారామె.  అయితే రాజ‌కీయ విబేధాల వ‌ల్లే ఈ ఆస్తుల గొడ‌వ బ‌య‌ట ప‌డిందా?  లేక ఆస్తుల గొడ‌వ వ‌ల్లే.. ఈ అన్నాచెల్లెళ్లు.. రాజ‌కీయంగా విడిపోయారా? అన్న‌ది కూడా ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశ‌మే.

రాజకీయ కక్షల వల్ల జగన్ ఆస్తులు ఇవ్వడం లేదని వారు అంటుంటే, రాజకీయంగా తనను దెబ్బతీయడానికే షర్మిళ‌ ఈ వివాదాన్ని వాడుకుంటోందని వాదిస్తోంది జగన్ వర్గం. ఒకప్పుడు రాజన్న బిడ్డలుగా కలిసి ఉన్న వారు.. ఇప్పుడు కోర్టులో ఒకరిపై ఒకరు అఫిడవిట్లు వేసుకోవడం వైఎస్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఏది ఏమైనా త‌ల్లి, చెల్లితో పెట్టుకుని జ‌గ‌న్ చాలా  పెద్ద త‌ప్పు చేశార‌నీ.. ఇది  జ‌నాల‌లో ఒక  నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేసింద‌ని.. జ‌గ‌న్ ఘోర ప‌రాజయానికి గ‌ల కార‌ణాల్లో ఇదీ ఒక‌ట‌ని కూడా అంటారు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు.

google-ad-img
    Related Sigment News
    • Loading...