ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు

  కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  క్లిఫ్‌ హౌస్‌ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేసి.. అది నకిలీ ఇ-మెయిల్‌గా తేల్చారు. బాంబు బెదిరింపు తర్వాత సీఎం నివాసాన్ని డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాం.   కానీ ఎక్కడా అనుమానాస్పదంగా కనబడలేదు’’ అని పోలీసులు వెల్లడించారు. తనిఖీల సమయంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపుల వ్యవహారంతో తాజాగా వచ్చిన ఇ-మెయిల్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు  
 ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు Publish Date: Jul 13, 2025 6:16PM

పామ్ ఆయిల్ మంత్రి

  రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వంటి శాఖల మంత్రులను మనం ఇప్పటి వరకు చూశాం.. కాని  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా పామ్ ఆయిల్ మంత్రి వచ్చారు..జిల్లాలో ఆయన పామ్ ఆయిల్ సాగుపై దృష్టి సారించారు. ఏ కార్యక్రమాని హాజరైనా పామ్ ఆయిల్ సాగుపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. దీంతో ఆయనను జిల్లా రైతులు ముద్దుగా పామ్ ఆయిల్ మంత్రి గా పిలుచుకుంటున్నారు.. ఆయన ఎవరో కాదు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… స్వతహాగా రైతు అయిన తుమ్మలకు వ్యవసాయ రంగంలో మంచి పట్టుంది. గతంలో కూడా ఆయన ఏ శాఖ మంత్రిగా పనిచేసినా జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ పైనే ఎక్కువగా శ్రద్ధ చూపేవారు.  తన స్వగ్రామం గండుగుల పల్లిలో వందల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగుచేస్తున్నారు. మిర్చి, పత్తి వంటి సాంప్రదాయక పంటలను వదిలేసి పామ్ ఆయిల్ , కొబ్బరి, వక్క, మిరియాలు, కోకో సాగు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఎంత తీరికలేని పనులు ఉన్నా ఏ మాత్రం సమయం దొరికినా స్వగ్రామం వైపు పరుగులు తీస్తారు. అర్ధరాత్రి సమయంలో కూడా గ్రామానికి చేరుకుని ఉదయాన్నే పంట పొలాల్లో ప్రత్యక్షం అవుతారు. అక్కడ పొలం పనిచేసే కార్మికులకు సలహాలు సూచనలు ఇస్తారు. ఈ రకంగా వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇదే ఒరవడిని జిల్లాలో రైతాంగం కూడా అలవర్చుకోవాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. జిల్లాలో పత్తి, మిర్చి పంటలు సాగుచేసే ఆరుగాలం కష్టపడినా పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు అప్పుల పాలు అవుతున్నారు.  ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి గా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆయన పామ్ ఆయిల్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా రైతులు పామ్ ఆయిల్ సాగుచేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు పామ్ ఆయిల్ సాగుచేస్తున్నారు. ఈ జిల్లాలో మరో 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికే 4,500 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు.. మరో 3000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికార్లను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలో తాను పాల్గనే ఏ కార్యక్రమం అయినా ఓ ఐదు నిమిషాలు పామ్ ఆయిల్ సాగు గురించి మాట్లాడటం  ఆనవాయితీ మార్చుకున్నారు. దీంతో ఆయను ఇప్పటి వరకు ఇరిగేషన్ మంత్రిగా, ఆర్ అండ్ బీ మంత్రిగా పిలుచుకున్న అభిమానులు ఇప్పుడు పామ్ అయిల్ మంత్రిగా నామకరణం చేశారు
పామ్ ఆయిల్ మంత్రి Publish Date: Jul 13, 2025 5:24PM

విడాకులు మంజూరవ్వడంతో.. పాలతో స్నానం చేసిన యువకుడు

  ప్రియుడితో పారిపోయిన భార్యతో విడాకులు మంజూరవ్వడంతో పునర్జన్మ లభించిందని 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు భర్త. అస్సాం రాష్ట్రం నల్బాడీ జిల్లా ముకుల్మువా గ్రామంలో భార్యతో విడాకులు మంజూరైన ఆనందంలో భర్త మాణిక్ అలీ  వేడుక చేసుకున్నారు. భార్యతో విభేదాల నేపథ్యంలో కోర్టుకెక్కిన ఓ జంటకు విడాకులు మంజూరయ్యాయి. కోర్టు తీర్పు విన్నాక ఇంటికి చేరుకున్న భర్త.. 40 లీటర్ల పాలతో స్నానం చేసి తాను ఇక స్వేచ్ఛాజీవినని సంతోషం వ్యక్తం చేశాడు.   తన భార్య కు ఓ ప్రియుడు ఉన్నాడని మాణిక్ అలీ చెప్పాడు. తనతో పెళ్లియి ఓ బిడ్డ పుట్టినా ఆమె తన లవర్ తో బంధం కొనసాగించిందని ఆరోపించాడు. తనను, తన బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందని చెప్పాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు. మొదటిసారి తప్పు చేసినప్పుడు బిడ్డ కోసం తాను ఆమెను క్షమించానని చెప్పాడు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని వివరించాడు. విడాకులు పొందాక కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని, కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని మాణిక్ అలీ చెప్పాడు.  
విడాకులు మంజూరవ్వడంతో.. పాలతో స్నానం చేసిన యువకుడు Publish Date: Jul 13, 2025 5:11PM

తీన్మార్‌ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలి : ఎమ్మెల్సీ కవిత

  తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన ఆమె.. మల్లన్న దారుణంగా మాట్లాడారని ఆక్షేపించారు. మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయకతే సీఎం రేవంత్, మల్లన్నతో మట్లాడించినట్లేనని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిట్లేనని మండిపడ్డారు. తాను మాములు ఆడబిడ్డను కాదని..అగ్గిరవ్వనని కవిత అన్నారు. తనలాంటి వాళ్లను కోట్లలో తయారు చేస్తానన్నారు.  శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుగోబోమని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా అని కవిత ప్రశ్నించారు.ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. మాండలికం అంటే ఎట్లా? అని కవిత అడిగారు. ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండన్న కవిత.. తీన్మార్‌ మల్లన్న నాపై దారుణంగా మాట్లాడారని చెప్పారు. వెంటనే తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని తీన్మార్ మల్లన్నకు కవిత సలహా ఇచ్చారు.
తీన్మార్‌ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలి : ఎమ్మెల్సీ కవిత Publish Date: Jul 13, 2025 4:13PM

వైరా బీఆర్ఎస్‌లో అయోమయం.. ఇంచార్జీ లేక క్యాడర్ గందరగోళం

  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి జోరుగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాత్రం అయోమయంలో పడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ సీపీఐ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  మదన్ లాల్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతోపాటు ఖమ్మం పార్లమెంట్ స్థానం గెలుచుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో మదన్ లాల్ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తనను కాదని మదన్ లాల్ టీఆర్ఎస్ లో పొంగులేటికి నచ్చలేదు.. ఈ నేపథ్యంలో మదన్ లాల్ - శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి.  ఆ తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి మళ్లీ మదన్ లాల్ కు టీఆర్ఎస్ టికెట్ దక్కింది. మరోవైపు మదన్ లాల్ ను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా పొంగులేటి రాములు నాయక్ ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి గెలిపించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వర్గపోరు కొనసాగుతోంది.. తిరిగి 2013 ఎన్నికల్లో మళ్లీ మదన్ లాల్ బీఆర్ఎస్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ నాయక్ చేతిలో ఓడిపోయారు.. మదన్ లాల్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని బలమైన వర్గం డిమాండ్ చేస్తోంది.. ఈ నేపథ్యంలోనే మదన్ లాల్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు మళ్లీ ఇంచార్జ్ పదవిపై వర్గపోరు ప్రారంభమైంది.  త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో నియోజకవర్గ ఇంచార్జ్ లేకపోవడంతో క్యాడర్ గందరగోళానికి గురవుతోంది. అధిష్ఠానం కూడా వైరా నియోజకవర్గం పై పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లా పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు సహజంగా ఆ నియోజకవర్గంలో ప్రతిబింబించేలా ఉన్నాయి. మదన్ సతీమణి తోపాటు మరో ఇద్దరు నేతలు ఇంచార్జ్ పదవికి పోటీపడుతున్నారు.. ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు. అధిష్ఠానం మౌనంగా ఉండటంతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది.
వైరా బీఆర్ఎస్‌లో అయోమయం.. ఇంచార్జీ లేక క్యాడర్ గందరగోళం Publish Date: Jul 13, 2025 3:38PM

కోటకు సీఎం చంద్రబాబు నివాళులు

  ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు చాలా బాధాకరమన్నారు. సినీపరిశ్రమకు ఎనలేని సేవలందించారని కొనియాడారు.  కోటకు నాకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. నటన అంటే ఏవిధంగా ఉండాలో.. 40 ఏళ్ల పాటు నటించి చూపించారన్నారు. .   సినిమాలతో పాటు ప్రజాసేవలోనూ కృషి చేశారు. కోటాకు 9 నంది అవార్డులు వచ్చాయని అవార్డులు రావడానికి ఆయన కృషి, ప్రతిభే కారణం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.  
కోటకు సీఎం చంద్రబాబు నివాళులు Publish Date: Jul 13, 2025 2:07PM

మహాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

  లష్కర్ బోనాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు వేదాశీర్వచనాలిచ్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు. మహాకాళి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేడు బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది.  భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. లష్కర్ బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మహాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ Publish Date: Jul 13, 2025 1:36PM

జ‌గ‌న్‌కి ఇంత ప‌బ్లిక్..ఎలా వ‌స్తారో మీకు తెలుసా?

  జ‌గ‌న్ చుట్టూ ఇంత మంది జ‌నం.. రియ‌లా ఫేకా? అస‌లేంటీ పొలిటిక‌ల్ ప‌బ్లిక్ స్టోరీ? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశం. బేసిగ్గా జ‌గ‌న్ కి బీసీ-ఎస్సీ-ఎస్టీ- ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీల్లో ఓటు బ్యాంకు ఉన్న మాట నిజం. ఆ సాలీడ్ ఓటు బ్యాంకే మొన్న‌టి ఎన్నిక‌ల్లో 39 శాతం ఓట్లు ప‌డేలా చేసింది. ఈ ఓటర్లు నిజానికైతే.. అంత ఫ్రీగా దొరికే వారు కాదు. ఎందుకంటే వీరు దైనంద‌ని జీవితాల్లో య‌మ బిజీగా ఉంటారు. కార‌ణ‌మేంటంటే వారు నిత్యం ఏదో ఒక ప‌నీ పాట చేసుకోకుంటే పూట గ‌డ‌వ‌దు. ఒక ర‌కంగా  చెబితే రెక్కాడితే గానీ డొక్కాడ‌దు. అలాంటి  జ‌నం జ‌గ‌న్ రావ‌డంతోటే ఇంత‌గా రోడ్డెక్క‌తారా? ఒక సినిమా న‌టుడికి మ‌ల్లే ఇంత‌గా పిచ్చెక్కి ఆయ‌నపై ఎగ‌బ‌డ‌తారా? అన్న‌దొక స‌స్పెన్స్. అయితే ఇక్క‌డే కొంద‌రికి ఒక‌ డౌట్ వ‌స్తోంది. కార‌ణ‌మేంటంటే.. ఇదంత ఒరిజిన‌ల్ ఫ్యాన్ బేస్ కాద‌న్న‌ది ఒక అంచ‌నా. కార‌ణం మ‌నం ఇందాకే మాట్లాడుకున్నాం. జ‌గ‌న్ కి ఉన్న ఓటు బ్యాంకు ఎలాంటిదో గుర్తు చేసుకున్నాం. వారంత తీరిగ్గా.. ఇలాంటి రాజ‌కీయ దండ‌యాత్ర‌ల‌కు రారు.   ఒక వేళ‌ వ‌స్తే.. ఇంట్లో పొయ్యిలో పిల్లి ఆ రోజంతా అలాగే నిద్ర పోయే ప‌రిస్థితి.మ‌రి వీరంతా ఎవ‌రు? ఎక్క‌డి నుంచి వ‌స్తున్నారు? వీరికేం ప‌నీ పాటా లేదా? అంటే ఇక్క‌డ కూడా మ‌నకొక ఉదాహ‌ర‌ణ దొరుకుతుంది. తాజాగా పేర్ని  నాని ఒక వీడియో లీక్ అయ్యింది. ఆయ‌న జ‌నాన్ని ఎలా పుర‌మాయిస్తారో అన్న విష‌యం పిచ్చ క్లారిటీతో ఈ వీడియోలో మ‌న‌కు క‌నిపిస్తుంది. అంతే కాదు గ‌తంలో జ‌గ‌న్ అధికారంలో ఉండ‌గా.. ఆయ‌న ప్రోగ్రామ్స్ కి ఏ టూ జెడ్ స‌ర్వీస్ అందించే వారున్నారు. ఈ బాధ్య‌త‌ల‌న్నిటినీ త‌ల‌శిల ర‌ఘురామ్ చూసుకునే వార‌ని చెబుతారు. ఇక స్క్రిప్టింగ్ కి ఒక టీమ్ ఇలా.. జ‌గ‌న్ త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీలో ఇలాంటి వంధిమాగ‌ధులను పుష్క‌లంగా నియ‌మించుకున్న‌ట్టు తెలుస్తోంది. వీరంద‌రికీ అధినాయ‌క‌త్వం పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌హించ‌గా.. ఆయ‌న కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేస్తుంటారట‌. జ‌గ‌న్ చుట్టూ ఇంత కోట‌రీ వ‌ర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కోట‌రీ ప‌న‌ల్లా ఏంటంటే.. జ‌గ‌న్ ఎ క్క‌డికి వ‌స్తే అక్క‌డికి జ‌నాన్ని తోల‌డం. ఆయా ఏర్పాట్లు చేయ‌డం. మొన్న‌టికి మొన్న బంగారు పాళ్యం మామిడి కాయ‌ల వ్య‌వ‌హారం చూసే ఉంటాం. త‌న ప‌ల్నాడు ప‌ర్య‌ట‌న‌లో ఏ విధంగా.. త‌ల‌కాయ‌ను త‌న కారు టైర్ల కింద వేసి తొక్కించాడో స‌రిగ్గా అలాగే.. మామిడికాయ‌ల‌ను కూడా  ర‌ప్పా ర‌ప్పా వేసి తొక్కించిన దృశ్యాల‌ను చూసే ఉంటాం.ఇవేవీ యాధృచ్చికంగా జ‌రుగుతున్న‌వి కావంటారు. వీట‌న్నిటి వెన‌క అతి పెద్ద నెట్ వ‌ర్క్ ప‌ని చేస్తూ ఉంటుంది. జ‌గ‌న్ ప‌ని అయిపోయింది. ఈసారి ఆ ప‌ద‌కొండు సీట్లు కూడా రావు. ఇక ఆయ‌న్ను భారీ ఎత్తున లీడ‌ర్లు కూడా వ‌దిలేస్తున్నారు.. అన్న కామెంట్ వినిపించిన‌పుడ‌ల్లా.. ఈ నెట్ వ‌ర్క్ అమాంతం ఉలిక్కి ప‌డుతుంది. జ‌గ‌న్ ఇమేజీని పెద్ద ఎత్తున‌ జాకీలేసి లేప‌డానికి.. వీరంతా కూడ‌బ‌లుక్కుంటారు. జూమ్ మీట‌టింగులు చేసుకుంటారు. కాన్ఫ‌రెన్స్ కాల్స్ మాట్లాడుకుంటారు.. అంతే ఒక ప్ర‌ణాళిక సిద్ధం చేసి జ‌గ‌న్ కి అప్ డేట్ చేస్తారు. అన్నా అక్క‌డ మ‌న గంజాయ్ బ్యాచ్ అరెస్ట‌య్యింది. వాళ్లంతా మ‌నం స‌ర‌ఫ‌రా చేసిన గంజాయ్ తీస్కునే ఇలా త‌యార‌య్యారు. అలాంటి వాళ్లు అరెస్ట‌యితే ఓదార్చాల్సింది మ‌న‌మే అని అలెర్ట్ చేస్తారు. ఎప్పుడో గ‌త ఏడాది చ‌నిపోయిన నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు విగ్ర‌హం పెట్ట‌డానికి చందాలిచ్చాం. మీరొస్తే బాగుంటుంది.. అని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. అలా అలా ఈ నెట్ వ‌ర్క్ ఒక ప‌ద్ధ‌తి  ప్ర‌కారం న‌డుస్తుంది. దీంతో ఇదిగో ఇలాంటి క్రౌడీ సీన్లు మీకు బుల్లి(టీవీ చానెళ్లు) అతి బుల్లి తెర‌లపై( మొబైల్ స్క్రీన్లు) ద‌ర్శ‌న‌మివ్వ‌డానికి రెడీ అయిపోతాయ్. ఒక ర‌కంగా చెబితే.. వీరు ప్ర‌తి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌నూ ఒక సినిమా షూటింగ్ స్థాయిలో ప్లాన్ చేస్తారంటే అతిశ‌యోక్తి కాదు. కార‌ణం అక్క‌డ హీరోల సినిమాలు గొప్ప‌గా ఆడాలి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కుర‌వాల‌న్న‌ది టార్గెట్. అదే ఇక్క‌డ జ‌గ‌న‌న్న క్రేజ్ ఎంత మాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న రోడ్డు మీద‌కొస్తే ఇస‌కేస్తే రాల‌నంత జ‌నం వ‌స్తున్నార‌న్న ప‌బ్లిసిటీ పీక్ లో ఉండాల‌ని ఫిక్స్ అవుతారు. త‌ద్వారా త‌మ సాలిడ్ ఓటు బ్యాంకును మ‌రింత యాక్టివ్ చేస్తుంటారు.ఎందుకంటే త‌మ‌కు ఓటు వేసే వారికి.. జ‌గ‌న్ కి క్రేజ్ ఉంద‌ని తెలియ‌డం కూడా ముఖ్య‌మే. కార‌ణం.. ఏ వార్త‌ల్లో లేని జ‌గ‌న్ కి వాళ్లు మాత్రం ఎందుకు ఓటు వేయాలి?   ఇదంతా ఒక ప్రీప్లాన్డ్ స్కెచ్. ఇందులో అవ‌స‌ర‌మైతే ఎంద‌రు ప్రాణాలు పోయినా ప‌ర్లేదు. కానీ.. తామ‌నుకున్న ప్ర‌చారం మాత్రం ఒక రేంజ్ లో సాగాల‌న్న‌ది.. వీరి ప్ర‌ధాన టార్గెట్ గా తెలుస్తోంది. జ‌గ‌న్ ప‌దే ప‌దే ఒక మాట అంటూ ఉంటారు. మ‌న‌కంటూ ప్ర‌త్యేకించి ఛానెళ్లు, ఇత‌ర మీడియా నెట్ వ‌ర్క్ తో ప‌ని లేదు.. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మ‌న ప‌ని అదే సులువు అవుతుంద‌ని ఆయ‌న అనేది ఇందుకే. ఎందుకంటే ఏ పొలం ప‌నులో, ఇత‌ర ప‌నీ పాట‌ల్లో ఉండే త‌న ఓట‌ర్ల చేతుల్లో అయితే ఫోన్లుంటాయి. వాటిల్లో ఈ విజువ‌ల్ క్లిప్పింగులు ప‌దే ప‌దే క‌నిపిస్తే చాలు.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ మ‌న ఓటు బ్యాంకు అలాగే నిలిచ ఉంటుంద‌న్న ఆలోచ‌న ఇందులో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటారు కొంద‌రు విశ్లేష‌కులు.
జ‌గ‌న్‌కి  ఇంత ప‌బ్లిక్..ఎలా వ‌స్తారో మీకు తెలుసా? Publish Date: Jul 13, 2025 1:15PM

తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి ..గాల్లోకి కాల్పులు

  మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన  క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఇవాళ ఉదయాన్నే కొందరు జాగృతి కార్యకర్తలు  కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముదరడంతో క్యూ న్యూస్ సిబ్బందిపైనా అటాక్ చేశారు. ఆ సమయంలో ఆఫీస్‌లోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్‌మెన్‌లు.. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పు పట్టినందుకే దాడి చేసినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిచాయి. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి ..గాల్లోకి కాల్పులు Publish Date: Jul 13, 2025 12:54PM

నేను బ‌త‌కాలి త‌మ్మీ..అంటూ చ‌నిపోయావేంటి కోట‌?

  గ‌ణేశ్ సినిమాలో.. ఫేమ‌స్ డైలాగ్. నేను బ‌త‌కాలి త‌మ్మీ అంటూ ఆయ‌న చెప్పిన డైలాగుల‌కు అప్పట్లో య‌మ క్రేజుండేది. ఆపై గాయంలో ఆయ‌న ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా చాలా ఫేమ‌స్ అయ్యింది. ఇక ఆమె సినిమాలో కోట న‌ట విశ్వ‌రూపం మామూలుది కాదు.ఇలా చెప్పుకుంటూ పోతే సీరియ‌స్ కామెడీ తేడా లేకుండా ఆయా పాత్ర‌ల‌ను అవ‌లీల‌లగా పోషించిన కొంద‌రంటే కొంద‌రు న‌టుల‌లో కోట న‌టన‌కు పెట్టిన‌ కోటే.. నిజంగా. సాధార‌ణంగా సినిమా రూట్ మ్యాప్ ఎలా ఉండేదంటే.. ఏదైనా ఎల్ఐసీ, జ‌ర్న‌లిజం, టీచింగ్, బ్యాంకు వంటి  రంగాల్లో జాబ్ చేస్తూ.. ఆపై నాట‌కాలు ఆడుతూ.. అటు నుంచి సినిమాల్లో అవ‌కాశాలు అంది పుచ్చుకుంటూ ఫైన‌ల్ గా ఇక్క‌డ సెటిల‌వ‌డం.  ఈ విష‌యంలో ఇప్ప‌టికీ చాలా మంది క‌ప్ప‌దాట్లు దాటుతూ ఉంటారు. వారికంటూ అంత తేలిగ్గా ఫీల్డ్ లో బిజీ కావ‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. కానీ కోట అలాక్కాదు. బ్యాంకు జాబు అదీ ఇదీ మొత్తం క‌ట్ట‌క‌ట్టి.. అట‌క మీద ప‌డేసి.. ఎంచ‌క్కా సినిమా ఫీల్డ్ లో సెటిలై పోయారాయ‌న‌.ఒక స‌మ‌యంలో ఆయ‌న బాబూ మోహ‌న్ తో చేసిన మామ‌గారు త‌ర‌హా కామెడీకి అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ త‌ర్వాత ఆయ‌న సీరియ‌స్ యాక్టింగ్ స్కిల్స్ కి సౌత్ లో చాలా సినిమాల్లో యాక్టింగ్ ఛాన్సులు వ‌చ్చాయి.  ప్ర‌కాష్ రాజ్ లా ఆయ‌న జాతీయ ఉత్త‌మ న‌టుడు సాధించ‌లేక పోయాడు క‌నీ.. ఇంచు మించు అలాంటి వ‌ర్స‌టైల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్న న‌టుడు కోటా శ్రీనివాస‌రావు.ఎక్క‌డో బ్యాంకుల్లో ఉద్యోగం చేసుకుంటూ నాట‌కాలాడి.. ఆ నాట‌కాల ప్ర‌స్తానం కొద్దీ సినిమాల్లోకి అడుగు పెట్టి.. అంచెలంచెలుగా న‌టుడిగా ఎన్నో ఎత్తుల‌కు ఎదిగి  ఒక స‌మ‌యంలో.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచి.. రాజ‌కీయంగానూ త‌న ప్ర‌స్తానం కొన‌సాగించి.. చివ‌రికిదిగో ఇలా త‌న జీవితానికే టాటా చెప్పి వెళ్లిపోయారు కోట‌. ఆయ‌న త‌న న‌ట జీవితంలో అన్ని కోరిక‌లూ తీర్చుకుని వెళ్లారు.  కానీ.. త‌న కొడుకు అర్ధాంత‌ర మ‌ర‌ణంతో తీవ్ర నిరాశా నిస్పృహ‌ల‌కు లోన‌య్యారు. ఇటు త‌న‌తో పాటు ఎన్నో చిత్రాల్లో క‌ల‌సి న‌టించిన బాబూ మోహ‌న్ కి, త‌న‌కి ఇద్ద‌రీ ఒక‌టే త‌ర‌హా పుత్ర శోకం క‌ల‌డం అత్యంత విషాద క‌రం.ఏది ఏమైనా కోట మృతి టాలీవుడ్ కి తీర‌ని లోటు. కార‌ణ‌మేంటంటే.. ఆయ‌న‌లాంటి పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి ఆయ‌నే మ‌రోమారు న‌ట‌కోటావ‌తారం ఎత్తాల్సిందే.  
నేను బ‌త‌కాలి త‌మ్మీ..అంటూ చ‌నిపోయావేంటి కోట‌? Publish Date: Jul 13, 2025 12:28PM

కోటకు నివాళులర్పించిన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినీ రంగానికి సేవలు చిరస్మరణీయమని ఆయన తెలిపారు. ఈ తరుణంలో ఆయన విలక్షణ నటుడు, మానవతావది. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు.  కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని వెంకయ్యనాయుడు తెలిపారు. కోట పార్థివదేహానికి  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు  
 కోటకు నివాళులర్పించిన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు Publish Date: Jul 13, 2025 12:16PM

పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం

  సంగారెడ్డి జిల్లా  పాశమైలారంలో మరో ప్రమాదం జరిగింది. ఎన్విరోవేస్ట్‌ మేనేజ్‌మెంట్  పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. పరిశ్రమలో లారీ, జేసీబీకి మంటలు వ్యాపించాయి. సిగాచీ పరిశ్రమ మిగిల్చిన విషాదాన్ని మరవకముందే అదే పాశమైలారంలో అగ్నిప్రమాదం  జరగడంతో  స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాశమైలారం సిగాచి పరిశ్రమలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 44 మృతదేహాలు గుర్తించిన సంగతి తెలిసిందే. మృతిచెందిన ఒక్కొక్కరికి కంపెనీ యాజమాన్యం రూ. కోటి పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.10 లక్షల సాయం చేస్తామని చెప్పింది. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.  
పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం Publish Date: Jul 13, 2025 11:39AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (జులై 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్తట్ మెంట్లన్నీ నిండియోయాయి. భక్తుల క్యూలైన్ ఆక్టోపస్ సర్కిల్ వరకూ సాగింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలేన్లలో వేచి ఉన్న భక్తులకు టిటిడీ యాజమాన్యం అన్న, జల ప్రసాదాలు పంపిణీ చేస్తున్నది. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక శనివారం ‘జులై 12’ శ్రీవారిని మొత్తం 92 వేల 221 మంది దర్శించుకున్నారు. వారిలో 42 వేల 260 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 51 లక్షల రూపాయలు వచ్చింది.  
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Publish Date: Jul 13, 2025 10:56AM

ఇంధ‌న స్విచ్ ఆఫ్ చేసి టేకాఫ్ చేసే పైలెట్ ఎక్క‌డైనా ఉంటారా?

ఫ్ల‌యిట్ యాక్సిడెంట్ జ‌రిగిన రెండు మూడు రోజుల త‌ర్వాత వెలుగు చూసిన కోణాల్లో ఇదీ ఒక‌టి. అదేంటంటే.. ఇంధ‌న స్విచ్ ని ఆన్ చేయ‌కుండానే అహ్మ‌దాబాద్ టు లండ‌న్ ప్లయిట్ టేకాఫ్ అయ్యింది.  ఆ మాట‌కొస్తే ఫ్యూయ‌ల్ పాస్ కాకుండా ఫ్ల‌యిట్ ఎలా టేకాఫ్ అయ్యిందని కొంద‌రు అడిగిన ప్ర‌శ్న‌కు వీరు చెప్పిన స‌మాధానం ఏంటంటే..  పైపుల్లో మిగులు గా ఉన్న ఇంధ‌నంతో ఫ్ల‌యిట్ పైకి లేచింద‌నీ.. ఇంత‌లో ఫ్యూయ‌ల్ అంద‌క పోవ‌డం వ‌ల్లే.. ఫ్ల‌యిట్ టేకాఫ్ అయిన 32 సెక‌న్ల‌కే క్రాష్ ల్యాండ్ అయ్యింద‌ని చెప్పుకొచ్చారు. టేకాఫ్ టైంలో స్విచ్చుల‌తో ఆడుకునేంత‌ తెలివి త‌క్కువ పైలెట్ ఎక్క‌డా ఉండ‌డు. ఇదీ ఎయిర్ ఇండియా ఏఐ 171 క్రాష్ పై .. విడుద‌లైన  ఏఏఐబి ప్రాథమిక నివేదికపై   ఏవియేషన్ నిపుణుడు మార్క్ మార్టిన్ స్పందన. రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపేశార‌ని, దీనివల్ల టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లు ఆగిపోయాయని అంటోంది ఏఏఐబి రిపోర్ట్.  ఒక వేళ అదే నిజ‌మైతే.. 787 బోయింగ్ ఆప‌రేట‌ర్ల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా దీని ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటారు మార్టిన్.  దానికి తోడు.. కేంద్ర విమానయాన మంత్రి కూడా ఇదే ఫైన‌ల్ రిపోర్ట్ కాద‌ని అన్నారు. దీన్నిబ‌ట్టీ చూస్తే ఫ్యూయ‌ల్ స్విచ్ మాత్ర‌మే ఈ ప్ర‌మాదంలో కీల‌కం కాద‌న్న‌ది తెలుస్తూనే ఉంది. ఇక మార్టిన్ చెబుతున్నట్టు అలా జ‌రిగే అవ‌కాశ‌ముందా? అన్న‌ది కూడా అత్యంత ముఖ్య‌మైన విష‌య‌మే. ఎందుకంటే ఒక ఫ్లైట్ పైల‌ట్ సీట్ లో కూర్చున్నాక‌.. అన్ని స్విచ్ ల‌ను చెక్ చేసుకోవ‌డం ఒక అల‌వాటుగా మార్చుకుంటారు. అంతే కాదు.. ఇక్క‌డ ఒక‌రికి ఇద్ద‌రున్న‌పుడు.. అది మ‌రింత ఎక్కువ జాగరూక‌త‌తో సాగుతుంది.   ఫ్ల‌యిట్ ఇంధ‌న స్విచ్ ని ఆపుకుని ఒక ఫ్ల‌యిట్ టేకాఫ్ అయ్యిందంటే అది ప్ర‌పంచ ఏవియేష‌న్ చ‌రిత్ర‌లోనే ఒక చీక‌టి రోజు. ఎందుకంటే విమానం న‌డిచేదే ఇంధ‌నం మీద‌. అలాంటి ఇంధ‌నం స్విచ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? చూసుకోకుండా ఒక‌రికి ఇద్ద‌రు పైలెట్లు టేకాఫ్ చేశారంటే.. అది ఫ్ల‌యిట్ మేనేజ్మెంట్ కే కాదు పైలెట్ మేనేజ్మెంట్ కి కూడా అవ‌మాన‌క‌ర‌మే.  మాములుగా మ‌నం చిన్న కారు తోలితేనే.. అది ఫ్యూయ‌ల్ మార్క్ ద‌గ్గ‌ర ప‌దే ప‌దే చూపిస్తుంది. అలాంటిది ఒక ఫ్ల‌యిట్ ఇంకెంత ఇండికేట్ చేసి ఉండాలి. అది కూడా అల్ట్రా మోడ్ర‌న్ అయిన బోయింగ్ ఫ్ల‌యిట్ ఎంత‌గా  హెచ్చ‌రిస్తుంది? అన్న దగ్గ‌రే అంద‌రి ఆలోచ‌న‌లు ఆగిపోతున్నాయ్. మ‌రి చూడాలి కాక్ పిట్ లో ఆ ఇద్ద‌రు పైలెట్లు ఇంధ‌న స్విచ్ సంభాష‌ణే ఫైన‌ల్ అవుతుందా? లేక మ‌రేదైనా విష‌యం బ‌య‌ట ప‌డుతుందా తేలాల్సి ఉంది.
ఇంధ‌న స్విచ్ ఆఫ్  చేసి టేకాఫ్ చేసే పైలెట్  ఎక్క‌డైనా ఉంటారా? Publish Date: Jul 13, 2025 10:38AM

నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో  విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం (జులై 13) తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. నాలుగు దశాబ్దాలుగా వందలాది సినిమాలలో నటించి, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు 750కి పైగా చిత్రాలలో నటించిన కోట శ్రీనివాసరావు.. ఇటీవలి కాలంలో ఆయన సినిమాలలో నటించడం మానేసి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమేడియన్ ఇలా విభిన్నపాత్రలలో తనదైన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సులలో కోట శ్రీనివాసరావు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.  తెలుగుతో పాటు  మలయాళం, కన్నడ, హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించారు.   1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి విచ్చిన కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక ఆయనకు తొమ్మిది సార్లు నంది పురస్కారాలు నమించాయి. కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.  
నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత Publish Date: Jul 13, 2025 6:52AM

అధ్యాపకుడి లైంగిక వేధింపులు... కాలేజీలో నిప్పంటించుకున్న విద్యార్థిని

  ఒడిశా బాలాసోర్‌లోని ఒక కళాశాలలో  ఘోర విషాదకర ఘటన జరిగింది. గురువు  లైంగిక వేధింపులకు భరించలేక ఓ విద్యార్థిని కాలేజిలోనే నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమె 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను కాపాడబోయిన మరో విద్యార్థికి కూడా 70 శాతం కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ అధ్యాపకుడిని అరెస్టు చేశారు. ఉన్నత విద్యాశాఖ కళాశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యబన్షి సూరజ్ హామీ ఇచ్చారు.  ఫకీర్ మోహన్ కాలేజీలో చదువుతున్న బాధిత విద్యార్థిని జులై 1న కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసింది. తన విభాగాధిపతి సమీర్ కుమార్ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వారం రోజుల్లో అతనిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థినికి హామీ ఇచ్చినప్పటికీ, అది జరగలేదని తెలుస్తోంది. సదరు అధ్యాపకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థిని, ఇతర విద్యార్థులతో కలిసి కళాశాల గేటు వెలుపల నిరసనకు దిగింది. ఆ సమయంలో విద్యార్థిని ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి, తనపై తాను పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది.
అధ్యాపకుడి లైంగిక వేధింపులు... కాలేజీలో నిప్పంటించుకున్న విద్యార్థిని Publish Date: Jul 12, 2025 9:29PM

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

  నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డ్యామ్  గేట్లను ఎత్తడంతో శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. పర్యాటకులు ఇదే క్రమంలో దోమలు పెంట నుంచి సున్నిపెంట వరకు వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ మూడు గంటలుగా రహదారిపై నిలిచిపోయాయి. వాహనాలు అంతేకాకుండా శని ఆదివారం సెలవులు కావడంతో శ్రీశైల దైవ దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి జాలువారే కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు భారీగా సొంత వాహనాల్లో తరలివస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇదే సందర్భంలో లింగాల గట్టు గ్రామంలో జోరుగా చేపల అమ్మకాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం రెండవ పట్టణ పోలీస్ అధికారులు ట్రాఫిక్ రాకపోకలకు ఏర్పడిన అంతరాయాన్ని నియంత్రించే విధంగా చర్యలు చేపట్టారు.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు Publish Date: Jul 12, 2025 9:06PM

డ్రైవర్ రాయుడు హత్య కేసులో నిందితుల ఫోటోలు విడుదల

  శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంచార్జ్ వినూత కోట డ్రైవర్ హత్య కేసులో నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుతో సహా శివకుమార్, షైక్ తాసాన్, గోపిలను చెన్నై  పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రెండు వారాల క్రితం డ్రైవర్ రాయుడిని వినుత విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత చెన్నైలోని కూవం నదిలో మూడు రోజుల క్రితం గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై జనసేన గుర్తు, వినుత పేరు ఉండడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు, రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో వినుత, ఆమె భర్త, మరో ముగ్గురు నిందితులుగా తేలింది. వీరందరిని పోలీసులు చెన్నై నుంచి శ్రీకాళహస్తికి తీసుకొచ్చి విచారణ జరిపారు. రాయుడు ఆంధ్రాలో మర్డర్ చేసి చెన్నై లో పడేశాడు. హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా కీలక సమాచారం సేకరించాం. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. ప్రస్తుతం వాళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
 డ్రైవర్ రాయుడు హత్య కేసులో నిందితుల ఫోటోలు విడుదల Publish Date: Jul 12, 2025 8:56PM

అత్యంత ప్రమాదకరంగా..వైసీపీ రప్ప రప్ప ధోరణి

  ఎంత పెద్ద రెడ్ బుక్ రాసిన లోకేష్ కూడా.. మేం చట్ట ప్రకారం మాత్రమే.. శిక్షిస్తామని చెబుతారు. బాబు కూడా జగన్ని జైల్లో పెట్టడం ఎంత సేపు? కానీ పెట్టాలని పెట్టడం మన అభిమతం కాదని అంటారు. ఇది ఒక రకంగా చెబితే.. ఈ తండ్రీ కొడుకులు ఒకరికొకరు తాము కూడబలుక్కుని ప్రదర్శిస్తోన్న సంస్కారం మాత్రమే కాదు.. తమ శ్రేణులను కూడా అలా బిహేవ్ చేయమని సూచించే ఒకానొక క్రమశిక్షణతో కూడిన సూచన.అదే జగన్. ఎవడో ఒక కోన్ కిస్కా కార్యకర్త రాసుకొచ్చిన రప్ప రప్ప ఫ్లెక్సీ పొరబాటున మీడియా హైలెట్ చేసింది. దీని విషయంలో పార్టీ అధినేతగా జగన్.. ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయబోమని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆయనేమన్నారూ? అయితే తప్పేంటని కామెంట్ చేశారు. దీంతో రప్ప రప్ప ఒక అధీకృతమై పోయింది. అధినేతే రప్ప రప్ప తప్పు లేదన్నపుడు.. మనం మాత్రం ఎందుకు లైట్ తీస్కోవాలనుకున్న పేర్ని నాని వంటి నేతలు.. తమ శ్రేణులను రెచ్చగొట్టేలా మరింత దారుణంగా మాట్లాడారు. మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడేలా ఉన్నారు. ఆ మాటకొస్తే.. మీరేం చెప్పొద్దు.. చేసి చూపించమని మరింత దారుణంగా రెచ్చగొడుతున్నారు. ఇదే టీడీపీ గుడివాడలో ఒక ఫ్లెక్సీ పెట్టింది. కుప్పంలో బాబు గెలిస్తే నేనొచ్చి చెప్పులు తుడుస్తా! అన్న కోణంలో నాడు కొడాలి నాని అన్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చేలా.. ఈ ఫ్లెక్సీ కనిపించింది. ఇందులో ఒక సవాలుంది. ఆ సవాలును మేం గెలిచామన్న ధోరణి కనిపిస్తోంది. కానీ జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎక్కడి వరకూ వెళ్లిపోయిందంటే.. హింసను పెట్రేగేలా ప్రేరేపిస్తోంది. టీడీపీ నుంచి కూడా కొందరు దుందుడుకు చర్యలు చేస్తుండవచ్చు. కానీ అధినేత స్థాయిలో ఇలాంటి హింసాత్మక ధోరణిని రెచ్చగొట్టడం సమంజసం కాదన్న మాట వినిపిస్తోంది. ఇదే పేర్ని నాని.. తాను సమాచార శాఖను నిర్వహించారు. అంటే ఏ మాట వెలుగులోకి రావాలి. ఏ మాట రాకూడదు. దేనికి ప్రచారం ఎక్కువ కనిపించాలి. దేనికి కలిపించకూడదని.. ఈ సీనియర్ మాజీ మంత్రి వర్యులకు ఎంతో స్పష్టంగా తెలియాల్సి ఉంది. తెలుసు కూడా. కానీ ఇక్కడేం జరుగుతోంది. కావాలని తన కేడర్ ని రెచ్చగొడుతూ.. పది మందికి ప్రేరణనిస్తున్నారు. దీంతో ఎవరైనా చేయరాని పని చేస్తే ఇందుకు బాధ్యులెవరు? అన్నదిప్పుడు అర్ధం కాని ప్రశ్నగా తయారైంది.ఇప్పటికే అధినేత బయట అడుగు పెడితే ఎన్నేసి ప్రాణాలు పోతాయో అన్న టెన్షన్ రాజ్యమేలుతోంది. ఈ క్రమంలో ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యల కారణంగా ఇదెంతటి ప్రాణనష్టానికి దారి తీస్తుందో అన్న ఆందోళన చెలరేగుతోంది. మొన్నటికి మొన్న కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజ్వరిల్లిన హింస ఒక గుణపాఠంగా వీరెవరూ తీసుకోవడం లేదు. పైపెచ్చు ఇలాంటి ధోరణికి పాల్పడి.. అధినేత నుంచి వీరతాళ్లు వేయించుకోవాలన్న ఉత్సుక్తతతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికి మాటలు. వచ్చే రోజుల్లో అవి చేతల్లోకి మారితే పరిస్థితేంటి? అందుకేనా జగనన్న గంజాయి బ్యాచీకి కొమ్ము కాయడం, బెట్టింగ్ రాయుళ్ల విగ్రహాల ఆవిష్కరించడం. ఏమీ అర్ధం కావడం లేదని వాపోవడం సగటు ఆంధ్రుడి వంతు అవుతోంది.అంటే జగన్ ప్రస్తుతం వెళ్తున్న ధోరణి చూస్తుంటే.. ఇప్పటి వరకూ సీమకే పరిమితమైన ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రమంతటా విస్తరించడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోందని వాపోతున్న వారు లేక పోలేదు. మరి ఈ వికృత సంస్కృతి ఎక్కడికి చేరుతుందో ఆ పైవాడికే ఎరుక అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.
అత్యంత ప్రమాదకరంగా..వైసీపీ రప్ప రప్ప ధోరణి Publish Date: Jul 12, 2025 8:35PM

నన్ను ఉరి తీయండి.. రాధిక తండ్రి పశ్చాత్తాపం

  హర్యానా టెన్నిస్ క్రీడాకారిణి రాధికను చంపిన కేసులో అరెస్ట్‌యిన ఆమె తండ్రి  దీపక్ యాదవ్ పశ్చాత్తాపానికి గురయ్యారు. ఆవేశంతో కుతురిపై కాల్పులు జరిపానని తనను ఉరితీయాలని పోలీసులను దీపక్ వేడుకున్నాట్లు ఆయన సోదరుడు విజయ్ తెలిపారు. రాధిక కోసం తండ్రి అన్నీ సమకూర్చాడని ఎందుకు ఇలా చేశాడో అర్ధం కావట్లేదన్నారు. నన్ను ఉరితీసే విధంగా ఎఫ్ఐఆర్ రాయండని కూడా పోలీసులకు చెప్పాడు. ఆడపిల్లను చంపేశానని రోదించాడు" అని వెల్లడించాడు. ప్రస్తుతం దీపక్ రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. రాధికను తండ్రి దీపక్ హత్య చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.  తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతో తండ్రి హత్య చేసినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వారు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. రాధిక గత ఏడాది ఒక కళాకారుడితో కలిసి రీల్స్ చేసింది. ఇది వారి కుటుంబంలో చిచ్చు పెట్టినట్లుగా మరో వాదన. తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తమ వర్గానికి చెందని వ్యక్తిని రాధిక ప్రేమిస్తోందని.. అది తన తండ్రికి ఇష్టం లేకపోవడంతోనే హత్య చేసినట్టు దీపక్‌ యాదవ్‌ సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు చెప్పుకొచ్చారు. ఇక, ఆమె ప్రియుడు.. రాధిక క్లాస్‌మేట్‌ అని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే రాధిక హత్యకు సంబంధించి వివిధ రకాలుగా వార్తలు బయటకు వచ్చాయి. 
నన్ను ఉరి తీయండి.. రాధిక తండ్రి పశ్చాత్తాపం Publish Date: Jul 12, 2025 8:19PM

పేర్ని నానిపై కేసు నమోదు

  వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో  నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని రెచ్చ్చగొట్టే విధంగా కామెంట్స్ చేశారని తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని  శ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వైసీపీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. రప్పా రప్పా నరికేస్తాం అంటూ అరవడం కాదని, రాత్రికి రాత్రే అంతా జరిగి పోవాలని అన్నారు. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని రేపు తమ ప్రభుత్వం వచ్చాక వేసేయాలని, తరువాత ఏమీ తెలియనట్టు పరామర్శించాలని వ్యాఖ్యానించారు.
 పేర్ని నానిపై కేసు నమోదు Publish Date: Jul 12, 2025 7:30PM

సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల.. ఖమ్మం జిల్లా రైతుల ఆనందం

  గోదావరి జలాల పై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది .. ఈనేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే పనిలో ఉభయ రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది.. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు కు తరలించేందుకు శనివారం సీతారామ ప్రాజెక్టులో భాగంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల నుంచి ఒక మోటారు ఆన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటపడి సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించే పనులను పూర్తిచేశారు.  ప్రస్తుతం గోదావరికి వరద ఉద్ధృతంగా వస్తోంది. మరో వైపు పాలేరు వద్ద అండర్ టన్నెల్ గత ఏడాది కూలిపోయింది.. దీంతో సాగర్ జలాలు ఖమ్మం జిల్లాలోని పంటపొలాలకు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పదిరోజులు వరకు నీరు రాని పరిస్థితి. దీనివల్ల తల్లాడ, కల్లూరు మేజర్ల కింద పొలాలు ఎండిపోతున్నాయి.. దీనిని దృష్టిలో పెట్టుకొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు కింద కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన మోటార్లలో ఒక దానిని శనివారం ఆన్ చేశారు. దీనివల్ల గోదావరి జలాలు ఏన్కూరు వద్ద సాగర్ కాలువ లో ప్రవేశించి తల్లాడ, కల్లూరు మేజర్ల కింద ఉన్న సుమారు 30వేల ఎకరాల్లో ఉన్న వరిపంటను రక్షించేందుకు అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినప్పటికీ అవకాశం ఉన్న మేరకు మోటార్లు బిగించి ఖమ్మం జిల్లా రైతును ఆదుకోవడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి అభినందనీయమని రైతులు తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల.. ఖమ్మం జిల్లా రైతుల ఆనందం Publish Date: Jul 12, 2025 6:49PM

ఏపీలో 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

  కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లోని నగరాలకు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అయిదు మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు ఆ పురస్కారాలు దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ నగరం సొంతం చేసుకుంది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమండ్రి ఎంపికైంది.  స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. రాష్ర్టంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపై ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంద్ర కార్యక్రమాల కారణంగానే ఈ అవార్డులు దక్కాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృషి చేసిన అధికారులు, పారిశుద్ద సిబ్బంది, సహకరించిన ప్రజలకు పట్టాభి అభినందనలు తెలిపారు.
ఏపీలో 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు Publish Date: Jul 12, 2025 6:37PM

వివేకా హత్య కేసులో నిందితునికి బెదిరింపు

  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 3 ముద్దాయి ఉమా శంకర్ రెడ్డి కి బెదిరింపు ఫోన్ వచ్చింది. ఈ మేరకు ఆయన పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఫిర్యాదు చేశారు. తాడిపత్రి కి చెందిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి పేరు చెప్పి ఈనెల 11వ తేదీ ఫోన్ ద్వారా తనను రెండు రోజుల్లో చంపుతామని  బెదిరించాడని  ఉమా శంకర్ రెడ్డి ఏ.ఎస్. ఐ సిద్దు కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుండి నన్ను రక్షించాలని ఫిర్యాదులో కోరారు. 2019 మార్చి15న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత చిన్నాన్నా వైఎస్ వివేకానందరెడ్డి.. పులివెందుల్లోని తన నివాసంలో దారుణంగా హత్యకావించ బడ్డారు. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజులు ముందు కావడంతో ఈ హత్యకు రాష్ట్ర రాజకీయాల్లో రగడ లేపింది.
వివేకా హత్య కేసులో నిందితునికి బెదిరింపు Publish Date: Jul 12, 2025 5:41PM

గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్

  కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ పాలిటిక్స్ హీటెక్కింది.  కుప్పంలో చంద్రబాబు గెలవరని గతంలో మాజీ మంత్రి కొడాలి నాని  చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  బూట్‌ను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లు‌గా నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ గుడివాడ టీడీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటైంది.  మరోవైపు బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అంటూ వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. దీంతో పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం గరం గరంగా మారింది. మరోవైపు ఇవాళ గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి పేర్నినాని ముఖ్యఅతిథిగా హాజరవడంతో ఉద్రిక్తత నెలకొంది. చీకట్లో కన్నుకొడితే.. తలలు నరికేయండి అంటూ పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న కామెంట్స్‌కు నిరసనగా... నాగవరప్పాడు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు. అయితే ఫ్లెక్సీని చించకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.  
గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్ Publish Date: Jul 12, 2025 5:24PM

నిరుద్యోగ అర్చకులకు రూ.3 వేల భృతి : మంత్రి ఆనం

  ఏపీలో నిరుద్యోగ అర్చకులకు రాష్ట్ర  దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి  శుభవార్త చెప్పారు. 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని.. వారికి నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  దేవాదాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ. 147 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయన్నారు. వీటన్నింటిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.  సంయుక్త సమావేశంలో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో సమీక్షించి తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆనం తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబుతో నిర్వహించిన సమీక్షలో ఆలయాలకు సంబంధించిన పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఆయా సమస్యలపై చర్చించి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీవాణి ట్రస్టు నిధులపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు చెప్పింది. విజయవాడ దుర్గ గుడికి మరో రోడ్డు వేసేందుకు టీటీడీ సహకారం కావాలి. తిరుమల దేవస్ధానం బోర్డులో అన్యమతస్థులు ఉన్న విషయం వాస్తవం. టీటీడీ బోర్డులో దాదాపు 1000 మంది అన్యమతస్థులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కొనసాగుతోందన్నారు. 
నిరుద్యోగ అర్చకులకు రూ.3 వేల భృతి : మంత్రి ఆనం Publish Date: Jul 12, 2025 4:48PM

మంత్రులకు మునుగోడులో నో ఎంట్రీ బోర్డు!

అధికార కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట. అటువంటి ఆ జిల్లాలోని మునుగోడు నియోజక వర్గంలో మాత్రం జిల్లా మంత్రులకు ఎంట్రీ లేదంట. తన ఇలాకాలో జిల్లా మంత్రులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఎంట్రీ పాస్ ఇవ్వడం లేదంట. ఒక విధంగా చెప్పాలంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంట. ఆ నియోజకవర్గంలో పర్యటనకు జిల్లా మంత్రులే కాదు.. ఇతర మంత్రులు కూడా వెనకంజ వేస్తున్నారంట. తమ నేతకు మంత్రి పదవి దక్కే వరకు ఇతర మంత్రులు ఎవరూ సెగ్మెంట్లో అడుగుపెట్టకూడదని చిన్న కోమటిరెడ్డి అనుచరులు అల్టిమేటం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హేమాహేమీలైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి లాంటి దిగ్గజ నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తమ ప్రాబల్యం చాటుకుంటున్నారు. ప్రస్తుతం జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగినా, తన వారసుల్ని, వర్గీయుల్నీ పార్టీలో ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి రేవంత్ సర్కార్ లో కీలక మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కొనసాగుతున్నారు. అయితే మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరడం లేదు.  బీఆర్ఎస్‌ను ఓడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. అదే ఏడాదిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వెనక్కి వచ్చి తిరిగి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చిందంట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంగా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో విడత క్యాబినెట్ విస్తరణలో కూడా బెర్త్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.  జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో పర్యటించారు. కానీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గమైన మునుగోడులో మాత్రం ఇద్దరు మంత్రులూ ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. నియోజకవర్గ సమస్యలపై నేరుగా హైదరాబాదులోని ఉన్నతాధికారులతో  సమీక్షలు నిర్వహిస్తూ.. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించేవరకు మంత్రులెవ్వరూ మునుగోడులో పర్యటించాల్సిన అవసరం లేదని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అల్టిమేటం ఇచ్చారంట.  ఆ క్రమంలో మంత్రి హోదాలో రాజగోపాల్ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ పాస్ ఎందుకు ఇవ్వడంలేదో ఎవరికి అంత చిక్కడం లేదట.తనకు మంత్రి పదవి రాకుండా పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలు అడ్డుపడి ఉంటారని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మునుగోడు నియోజకవర్గ పర్యటనకు ఆహ్వానించడం లేదట. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే మంత్రి ఉత్తమ్ కూడా మునుగోడులో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదట. పట్టుదలకు మారుపేరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. తనకు మంత్రి పదవి వచ్చేవరకు నియోజకవర్గంలో ఏ మంత్రికి కూడా నో ఎంట్రీ అంటున్నారట. అందుకే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేస్తున్న ఇతర మంత్రులు సైతం మునుగోడు వైపు చూడటం లేదంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు అంటేనే రాష్ట్ర మంత్రులు దూరంగా ఉంటున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ పాస్ లేకుండా మునుగోడు పర్యటనకు వెళ్ళి  కొత్త పంచాయతీ మొదలు పెట్టడం ఎందుకని మంత్రులు భావిస్తున్నారట.
మంత్రులకు మునుగోడులో నో ఎంట్రీ బోర్డు! Publish Date: Jul 12, 2025 4:08PM

రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు

  శ్రీకాళహస్తి జన సేన ఇంచార్జ్ వినుతకోట మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. రాయుడిని చిత్రహింసలకు గురి చేసి చంపి.. ఆపై మృతదేహాన్ని తమ కారులోనే వినూత కోటా దంపతులు నదిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. తన మాజీ డ్రైవర్‌ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి వినూత కోటా అరెస్ట్‌ అయ్యారు. వినూత, ఆమె భర్త చంద్రబాబు  తోపాటు మరో ముగ్గురినీ చెన్నై పోలీసులు ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్‌ అరుణ్‌ మీడియాకు వెల్లడించారు.  రాయుడు ఆంధ్రాలో మర్డర్ చేసి చెన్నై లో పడేశాడు. హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా కీలక సమాచారం సేకరించాం. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. ప్రస్తుతం వాళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినుత పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబు పోలీసులు విచారించారు. మూడు నెలలుగా రాయుడుకు వినుత కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయని తెలిపింది. రాయుడు మృతికి వినుత కుటుంబ సభ్యులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. రాయుడు నానమ్మ ఫిర్యాదు మేరకు వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు, వినుత తండ్రి భాస్కర్‌లని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసుని ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఆపై అది ఆమె మాజీ డ్రైవర్‌ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు.  కోట వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉందని, గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు అయిన విషయం పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన అధిష్ఠానం ప్రకటించింది. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు Publish Date: Jul 12, 2025 3:53PM

‘ట్రంప’రితనం.. రష్యాపై కోపం.. భారత్ పై 500శాతం సుంకం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనం వెర్రితలలు వేస్తోంది.  ఉక్రెయిన్ తో నాన్ స్టాప్ వార్ చేస్తోన్న ర‌ష్యాను క‌ట్ట‌డి చేయ‌డానికి ఆయనొక కొత్త మార్గం క‌నిపెట్టారు. దానిపేరే భారీ ఎత్తున సుంకాల విధింపు. గ‌త కొంత కాలంగా భార‌త్ ర‌ష్యా నుంచి పెద్ద ఎత్తున చ‌మురు కొంటోంది. ఒక్క భారత్ మాత్ర‌మే కాదు ర‌ష్యా నుంచి చైనా, ట‌ర్కీ, ఇత‌ర ఆఫ్రిక‌న్ దేశాలెన్నో చ‌మురు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఇక్క‌డ విడ్డూర‌మేంటంటే.. ర‌ష్యాపై తాము అధిక సుంకాలు విధించి శిక్ష విధించ‌ద‌లుచుకున్నాం కాబ‌ట్టి.. ర‌ష్యా నుంచి చ‌మురు కొనే దేశాల నుంచి మా దేశంలో దిగుమ‌తి చేసే వ‌స్తువుల‌పై 500 శాతం మేర ప‌న్ను విధిస్తామంటున్నారు.  ఈ బిల్ల‌ును రిప‌బ్లిక‌న్ సెనెట‌ర్ గ్రాహం ఏప్రిల్ నెలలో ప్ర‌తిపాదించ‌గా.. దాన్ని ట్రంప్ కూడా    బాగానే ఉంద‌ని అన్నారు. కేబినెట్ మీటింగ్ త‌ర్వాత ఆయ‌న్ను అడిగిన మీడియా వారికి అవును ఇది నా ఎంపిక అంటూ బాహ‌టంగా కుండ బ‌ద్ధ‌లు కొట్టారాయ‌న‌. ఒక్క గ్రాహంతో పాటు 84 మంది సెనెట‌ర్లు.. ఈ ర‌ష్య‌న్ ఈ శాంక్ష‌న్ బిల్- 2025కి మ‌ద్ధ‌తుగా ఉన్నార‌ట‌. ఈ బిల్లు వ‌చ్చే ఛాన్సు లేదు కానీ.. ఒక వేళ వ‌స్తే ప‌రిస్థితి ఏమిట‌న్న చ‌ర్చ కూడా మొద‌లైంది. ఒక వేళ ఇదే జ‌రిగితే.. ప్ర‌పంచం రెండుగా చీలినా ఆశ్చ‌ర్యం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికాతో ఉన్న దౌత్య, వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తింటాయి. అంతే కాదు ఇక‌పై వాషింగ్ట‌న్ పై ఆధార‌ప‌డే దేశాలు కాస్తా.. ఢిల్లీ, మాస్కో, బీజింగ్ వైపు చూస్తాయి. దీంతో పెద్ద ఎత్తున అమెరికా వ్యాపారులు, వినియోగ‌దారులు న‌ష్ట‌పోతారు. అంతేకాదు ఎల‌క్ట్రానిక్, ఆటోమొబైల్ వంటి యూఎస్ సెక్టార్స్ లో ద్ర‌వ్యోల్బ‌ణం వ‌స్తుంది. దీంతో అమెరికా తీవ్ర న‌ష్టాల పాలు అవుతుంది. అయితే ఇక్క‌డే భార‌త‌ పెట్రోలియం మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పురీ.. ఇదంతా  ప్ర‌పంచానికే మేలు చేసేద‌ని అన్నారు. తాము ర‌ష్యా నుంచి చీపుగా పెట్రోలు కొన‌డం వ‌ల్ల‌.. ప్ర‌పంచ‌ పెట్రోలు ధ‌ర‌లు నియంత్రణలో,  అందుబాటులో ఉన్నాయ‌ని.. అదే ర‌ష్యా రోజుకు ఉత్ప‌త్తి చేసే 9 మిలియ‌న్ బ్యార‌ళ్ల చ‌మురు అలాగే నిలిచి పోతే.. ఆ మేర‌కు ఈ చ‌మురు ఇత‌రుల నుంచి కొనాల్సి వ‌స్తుంది. త‌ద్వారా.. చ‌మురు ధ‌ర‌లు బ్యార‌ల్ కి 120 నుంచి 130 డాల‌ర్లకు పెరుగుతుంది, కాబ‌ట్టి తాము చేసింది స‌రైన పనే అన్నారు కేంద్ర మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పురి. ఇక్క‌డ గుర్తించాల్సిన మ‌రో  విష‌య‌మేంటంటే.. చ‌మురు ధ‌ర‌ల‌పై ఆంక్ష‌లున్నాయి కానీ చ‌మురు కొనాలా  వ‌ద్దా అన్న కోణంలో ఆంక్ష‌లు విధించ‌లేద‌ని అంటారు మ‌న  కేంద్ర‌మంత్రి. అయితే ఈ విష‌యంపై ర‌ష్యా స్పందిస్తూ.. ఇలాంటి బిల్లులు అమెరిక‌న్ కాంగ్రెస్ పాస్ చేస్తే.. ఇక ఆ దేశాన్ని ఎవ్వ‌రూ కాపాడ‌లేర‌ని అంటోంది. అంతే కాదు.. ఉక్రెయిన్ కి తాము సైనిక‌ సాయం చేస్తామ‌ని అమెరికా ప్ర‌క‌టించినంత‌నే ర‌ష్యా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు చేసి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అంటే యూఎస్ ఎంత ర‌ష్యాను క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తే ఆ దేశం మ‌రింత  రెచ్చిపోతుంది. ఈ విషయం ఇప్పటికే రుజువైంది.   అయినా రష్యాతో గొడ‌వ ఉంటే ఆ దేశంతో చూసుకోవాలి. కానీ ఇలా ఇత‌ర దేశాల మీద ప్ర‌తాపం  చూపిస్తామ‌న‌డ‌మేంటి? భార‌త్ -పాక్  మద్య సత్సంబంధాలు లేవు. అయినా  అలాంటి పాక్ అమెరికా అక్కున చేర్చుకుని సహకారం అందించడం లేదా?  అలాగే పాక్ కి డ్రోన్ సాయం చేసిన ట‌ర్కీకి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌లేదా? అమెరికా చేస్తే నీతి ప‌క్క‌నోళ్లు చేస్తే ద్రోహ‌మా? అంటూ అమెరిక‌న్ విధానాల‌ను దుమ్మెత్తి పోస్తున్నారు   అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు.
‘ట్రంప’రితనం.. రష్యాపై కోపం.. భారత్ పై 500శాతం సుంకం! Publish Date: Jul 12, 2025 3:45PM

విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టేసిన కొత్త కెప్టెన్ శుభమన్ గిల్

భారత జట్టు నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టి మరీ ఈ రికార్డును సాధించాడు. భారత టెస్ట్ జట్టు నూతన సారథి శుబ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బ్యాట్‌కు ఒక రేంజ్లో పనిచెప్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో గిల్ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో పలు పాత రికార్డులకు బ్రేక్ చేస్తూ ఫోకస్ అవుతున్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో మరో క్రేజీ రికార్డు సృష్టించాడు శుబ్‌మన్. ఏకంగా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అతడు అధిగమించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులలో కలిపి  ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 585 పరుగులు చేసిన గిల్.. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 16 పరుగులు చేశాడు. దీంతో  ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ 601 పరుగులకు చేశాడు. తద్వారా ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు బాదిన వారి లిస్ట్‌లో లెజెండ్ రాహుల్ ద్రవిడ్  (4 ఇన్నింగ్స్‌ల్లో 602 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో గిల్ (601) నిలిచాడు. శుబ్‌మన్ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (593), సునీల్ గవాస్కర్ (542) ఉన్నారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5 మ్యాచుల్లో 712 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచులు ఉన్నందున జైస్వాల్‌ను గిల్ అలవోకగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన గిల్.. మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్ లో  విఫలమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు గిల్.  స్పీడ్‌స్టర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే గిల్ ఔట్ అయినా ఒక ఎండ్‌లో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 నాటౌట్), మరో ఎండ్‌లో పించ్ హిట్టర్ రిషబ్ పంత్ (19 నాటౌట్) గట్టిగా నిలబడ్డారు. రెండో రోజు ఆటను విజయవంతంగా ముగించారు.
విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టేసిన కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ Publish Date: Jul 12, 2025 3:29PM