పోస్టాఫీస్ బంపర్ స్కీమ్: రోజుకు రూ.100 దాచుకుంటే రూ.2 లక్షలు మీ సొంతం!

posted on: Jun 23, 2026 12:57PM

చాలా మందికి జీవితంలో డబ్బు సంపాదించడం సులువుగానే తెలుస్తుంది కానీ, ఆ వచ్చిన సంపాదనను ఎలా సరైన పద్ధతిలో పొదుపు చేయాలో అర్థం కాదు. మరికొందరైతే తమ నెలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని, అందులో ఇక పొదుపు చేయడానికి ఏం మిగులుతుందని భావిస్తూ ఉంటారు. అయితే ఆర్థిక నిపుణులు చెప్పే మాట ఒక్కటే.. పొదుపు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, కేవలం స్థిరమైన ఆలోచన, క్రమశిక్షణ ఉంటే చాలు. రోజుకు రూ.500 సంపాదించే సామాన్యుడు లేదా చిరు వ్యాపారి సైతం సులభంగా పొదుపు చేసుకునేందుకు భారత ప్రభుత్వ పోస్టాఫీస్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (Post Office RD) పథకం. ఇందులో చాలా తక్కువ మొత్తంతోనే మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో చేరడానికి కనీస పెట్టుబడి కేవలం రూ.100 మాత్రమే. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, మధ్యతరగతి ఉద్యోగులు ఎవరైనా సరే తమకు తోచిన మొత్తాన్ని నెలనెలా ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్‌డీ పథకంపై ఏకంగా 6.7 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ వడ్డీని ప్రతి త్రైమాసికానికి (Quarterly) ఒకసారి లెక్కిస్తూ ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వ రక్షణ ఉండటం వల్ల ఇందులో ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు, మీ పెట్టుబడికి పూర్తి గ్యారెంటీ ఉంటుంది.

ఒకవేళ మీరు ఈ పథకంలో రోజుకు రూ.100 చొప్పున పక్కన పెడితే, నెలకు రూ.3,000 అవుతుంది. అంటే సంవత్సరానికి మీరు రూ.36,000 పొదుపు చేస్తారు. ఇలా ఐదేళ్ల పాటు (5 Years) క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, మీ మొత్తం పెట్టుబడి రూ.1,80,000 అవుతుంది. దీనిపై ప్రభుత్వ నియమాల ప్రకారం 6.7 శాతం వడ్డీ రేటుతో రూ.34,097 వడ్డీ లభిస్తుంది. దీనితో ఐదేళ్ల ఐదేళ్ల మెచ్యూరిటీ కాలం ముగిసేసరికి మీ చేతికి ఏకంగా రూ.2,14,097 లభిస్తాయి. చిన్న మొత్తాలతో ప్రారంభించి లక్షల రూపాయల నిధిని సమకూర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.

పిల్లల భవిష్యత్తు చదువుల కోసం, అత్యవసర ఖర్చుల కోసం లేదా సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ పథకం ఎంతో అనువుగా ఉంటుంది. అయితే ఈ ఆర్‌డీ ఖాతాలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను కాలానుగుణంగా సమీక్షిస్తూ మారుస్తుంది. కాబట్టి మీరు చేరే సమయానికి ఉన్న వడ్డీ రేటును బట్టి మీ తుది మెచ్యూరిటీ మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి నెల నిర్ణీత గడువులోగా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది, ఆలస్యంగా కడితే పెనాల్టీ పడటమే కాకుండా వడ్డీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పోస్టాఫీసులో ఈ పథకంతో పాటు సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ వంటి మరెన్నో సురక్షితమైన పొదుపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...