ఉప ప్రధాని అమిత్ షా.. విజయసాయి ట్వీట్ తో రాజకీయ సంచలనం.!

posted on: Jul 18, 2026 9:12AM

 

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ జాతీయ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి  హోంమంత్రి అమిత్ షా కు ఉప ప్రధానిగా ప్రమోషన్ దక్కనుందంటూ వైసీపీ మాజీ నాయకుడు,  రాజ్యసభ మాజీ సభ్యుడు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు  హాట్ టాపిక్ గా మారింది.  కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. 

 కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకు డిప్యూటీ పీఎం పదవి దక్కనుందంటూ వస్తున్న కథనాలను సమర్ధిస్తూ..  రాబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో అమిత్ షాను ఉప ప్రధానిగా మోడీ నియమించనున్నట్లు విజయసాయి పేర్కొన్నారు.  దేశ రాజకీయాల్లో అత్యంత నిర్ణయాత్మకమైన, పాత్ర పోషిస్తున్న అమిత్ షాకు ఉప ప్రధానిగా ప్రమోషన్ రావడం సముచితమని పేర్కొన్న విజయసాయి..  దేశ ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అమిత్ షా వెనుకాడరనీ, అందువల్లే ఉప ప్రధాని పదవికి ఆయన అన్ని విధాలా అర్హులని  పేర్కొన్నారు. 

భారత రాజకీయ చరిత్రలో గతంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులు ఉప ప్రధాని బాధ్యతలను స్వీకరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి   ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పదవితో అమిత్ షాకు దక్కబోయే స్థానాన్ని పోల్చారు. గతంలో సర్దార్ పటేల్ అలంకరించిన ఈ ఉన్నతమైన డిప్యూటీ పీఎం హోదాను అమిత్ షాకు కేటాయించడం  సముచితంగా ఉంటుందని పేర్కొన్న విజయసాయి.. , ముందుముందు  అమిత్ షా చేపట్టనున్న ఈ కొత్త బాధ్యతకు మద్దతు తెలుపుతూ అభినందనలు తెలిపారు.  

అమిత్ షా ఉప ప్రధాని అంటూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాకముందే..   విజయసాయి రెడ్డి వంటి సీనియర్ పార్లమెంటేరియన్ ఈ అంశంపై బహిరంగంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

భారతదేశంలో 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు విడతల్లోనూ డిప్యూటీ పీఎం పదవిని ఎవరికీ ఇవ్వలేదు. గతంలో బీజేపీ హయాంలోనే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆ హోదాను ఎవరికీ కేటాయించలేదు.  ఈ నేపథ్యంలో అమిత్ షాకు  ఉప ప్రధాని పదవి  అప్పగించడం ద్వారా, భవిష్యత్తులో ప్రధాని పదవిని చేపట్టబోయేది అమిత్ షాయే అన్న సంకేతాన్ని వ్యూహాత్మకంగా విజయసాయి ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇప్పటి వరకూ అయితే..  ఉప ప్రధాని నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటిక.. , విజయసాయి రెడ్డి పోస్ట్ వల్ల జాతీయ స్థాయిలో   ఈ విషయంపై చర్చ జోరందుకుంది.  ఒకవేళ  అమిత్ షా అధికారికంగా ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే, అది దేశ రాజకీయ ముఖచిత్రాన్ని,  అధికారిక ప్రాధాన్యతలను  మార్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

Amit Shah Deputy PM news, Vijaya Sai Reddy tweet on Amit Shah, Union Cabinet Reshuffle 2026, Narendra Modi government Deputy Prime Minister, YSRCP BJP political updates

google-ad-img
    Related Sigment News
    • Loading...