Latest News
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డి సహా ముగ్గురికి పోలీసు కస్టడీ
posted on: Mar 23, 2026 4:14PM
.webp)
మెయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలైన పిటిషన్ పై కోర్టు సోమవారం (మార్చి 23) తీర్పు వెలువరించింది. కాగా ఈ కేసులో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారిస్తే మరికొందరి పేర్లు తెర మీదకు వస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఇలా ఉండగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ పలు కీలక విషయాలను గుర్తించింది. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశాడనీ, అలాగే రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇప్పటి వరకూ 24 సార్లు పార్టీలు జరిగినట్లు కూడా గుర్తించింది.
ఆయా పార్టీలలో ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖలు హాజరైనట్లు భావిస్తున్న సిట్.. ఎవరెవరు ఆ పార్టీలకు హాజరయ్యారన్న సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఫామ్ హౌస్ సహా చుట్టుపక్కల అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నది. మరోవైపు డ్రగ్ పార్టీ సందర్బంగా పోలీసులపై కాల్పులు జరిపిన ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను షార్ప్ షూటర్గా దర్యాప్తు బృందం గుర్తించింది.
అతడికి ఢిల్లీ, పంజాబ్ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ మాఫియాతో సంబంధం ఉందని భావిస్తున్నది. ఈ విషయంపై నిర్ధారణకు సిట్ దర్యాప్తు బృందాలను ఢిల్లీ, పంజాబ్ లకు పంపినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. విచారణ బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించింది.






