Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోలవరం ముంపు ప్రాంతాలకు రక్షణ చర్యలు చేపట్టాలి : హరీశ్రావు
posted on: Jun 4, 2026 3:47PM
.webp)
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రభావంతో తెలంగాణలోని ముంపు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. మాజీ మంత్రి హరీశ్రావు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సీఈఓకు లేఖ రాసి, ముంపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
భద్రాచలంలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులకు ఈ లేఖను పినపాక, భద్రాచలం నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు స్వయంగా అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా జలగండం పొంచి ఉందని హరీశ్రావు లేఖలో పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా అదే స్థాయిలో ఉండటం ఆందోళనకరమని ఆయన తెలిపారు. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భద్రాచలం ప్రాంతం నిరంతరం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
భద్రాచలం వద్ద గోదావరి నది బెడ్ లెవల్ 26 మీటర్లు మాత్రమే ఉండగా, పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంతో 13.15 నుంచి 17.72 మీటర్ల మేర నీరు ఎప్పటికప్పుడు నిల్వ ఉండే అవకాశముందని వివరించారు. 2021లో కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాత ఏర్పడిన బ్యాక్వాటర్ ప్రభావంతో 2022లో భద్రాచలం, బూర్గంపాడు, సారపాక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తుచేశారు.
ఆ సమయంలో 22 లక్షల క్యూసెక్కుల వరదకే భారీ నష్టం సంభవించిందని, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36 నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరదలు వస్తే తెలంగాణలో ప్రాణ, ఆస్తి నష్టం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కేవలం గ్రామాలకే కాకుండా పరిశ్రమలకు కూడా బ్యాక్వాటర్ ముప్పు ఉందని హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఐదు వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. ఐఐటీ, వ్యాప్కోస్ అధ్యయనాల ప్రకారం 36 గ్రామాల పరిధిలో సుమారు 184 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ముంపు ప్రభావానికి గురవుతున్నట్లు వెల్లడించారు.
పదేపదే నష్టపోతున్న సుమారు రెండు వేల కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం అందించడంతో పాటు శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే భద్రాచలం డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న ఎనిమిది అవుట్ఫాల్ రెగ్యులేటర్ల వద్ద పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని సూచించారు.
భద్రాచలం వద్ద కొత్తగా ఐదు కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టాలని, బూర్గంపాడు, సారపాక తదితర ముంపు గ్రామాలకు రక్షణ గోడలు నిర్మించి తగిన పరిహారం అందించాలని కోరారు. తెలంగాణలో పోలవరం ముంపు సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణ కోసం భద్రాచలంలో ప్రత్యేకంగా పీపీఏ డివిజన్ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని హరీశ్రావు లేఖలో డిమాండ్ చేశారు.






