ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. ఎక్కడ చూసినా బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు

posted on: Apr 26, 2026 1:14PM

ఆంధ్రప్రదేశ్‌లో  పెట్రోల్, డీజిల్ కొరత  బెంబేలెత్తిస్తోంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల,  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా   ఈ సమస్య తీవ్రంగా ఉంది.   పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్  బోర్డులు కనిపిస్తున్నాయి.  కేవలం కొన్ని ప్రధాన బంకుల్లో మాత్రమే ఇంధనం లభిస్తుండటంతో, అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. తిరుమలలోని హెచ్పి పెట్రోల్ బంక్ పెట్రోల్, డీజిల్ కోసం   భారీగా వాహనాలు బారులు తీరాయి.

 పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు ట్యాంకు ఫుల్ చేయించుకుంటున్నారు. ఇక తిరుమల, తిరుపతి మధ్య తిరిగే వాహనాల డ్రైవర్లైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ సమస్య ఏర్పడితే తమ బతుకులు రోడ్డున పడతాయంటున్నారు. చాలా మంది అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ పోయించుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

ఇక పోతే.. ప్రస్తుతం సాగు సీజన్ కావడంతో డీజిల్ కొరత ప్రభావం గోదావరి జిల్లాల్లోని వ్యవసాయంపై తీవ్రంగా పడుతోంది. పొలాల్లో యంత్రాల ద్వారా కోతలు కోయాల్సిన సమయంలో డీజిల్ దొరక్క  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలు, ఆక్వా సాగు కోసం డీజిల్ అత్యవసరమైన తరుణంలో ఈ పరిస్థితి నెలకొనడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో పడ్డారు. 

చమురు కంపెనీల నుండి సరఫరా తగ్గడం, నిల్వల కొరత కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే..  రవాణా రంగం కూడా కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఆటోలు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల రవాణాపై కూడా దీని ప్రభావం పడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఈ అంశంపై స్పందిస్తూ, ప్రజలు ఆందోళన చెందవద్దని కోరుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే చమురు కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామనీ,  డిమాండ్‌కు అనుగుణంగా అదనపు నిల్వలను పంపాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేశామనీ తెలిపింది. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.  
 

google-ad-img
    Related Sigment News
    • Loading...