Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..?
posted on: Apr 21, 2026 4:27PM

త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయన్న చర్చతో వినియోగదారుల్లో గుబులు రేగుతోంది. గ్యాస్ ధరలపై స్పష్టత లేకపోయినా.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రం తప్పదన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆ భారాన్ని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు భరిస్తూ వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు పూర్తయ్యగానే ధరల పెంపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, పరస్పర దాడులు, కాల్పుల విరమణ ప్రయత్నాలు, హర్మూజ్ జలసంధి మూసివేత–తెరవడం వంటి పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తీవ్రంగా మార్పులకు లోనవుతున్నాయి.
ఒక దశలో బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు చేరగా.. ఆ తర్వాత 80 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 90 నుంచి 100 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. భారత్ దాదాపు 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటుండటంతో ఈ ధరల మార్పులు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలపై భారం పెరుగుతోంది. ప్రజలపై ఈ భారం మోపకుండా ప్రభుత్వం కొంతవరకు ట్యాక్స్లు తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ.. కంపెనీల నష్టాలు కొనసాగుతున్నాయి.
ఈ భారం తగ్గించేందుకు ఇప్పటికే స్పీడ్, పవర్ పెట్రోల్పై లీటరుకు 2 రూపాయలు పెంచిన ఆయిల్ కంపెనీలు.. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం అలాగే ఉంచాయి. అయితే ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ధరల పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయ్యింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా.
ఎంత మేర పెరుగుతాయన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం బ్యారెల్ చమురు ధర 95 డాలర్ల వద్ద ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు 8 నుంచి 15 రూపాయల వరకు పెరగొచ్చు. అదే ధర 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉంటే 3 నుంచి 7 రూపాయల వరకు పెరుగుదల ఉండొచ్చని చెబుతున్నారు. ఇక ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. మన దేశంలో దాదాపు 70 శాతం సరుకు రవాణా రోడ్డు మార్గంలోనే జరుగుతోంది. ట్రక్కులపై ఆధారపడే ఈ వ్యవస్థలో డీజిల్ ధరలు పెరిగితే.. నిత్యావసర వస్తువుల ధరలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రక్కులకు డీజిల్ సరఫరాపై అనధికారిక పరిమితులు విధిస్తున్నట్లు సమాచారం. సప్లై తగ్గిందన్న కారణంతో ఒక్కో ట్రక్కు పరిమిత పరిమాణంలోనే డీజిల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది.ఇక ధరల పెంపు ప్రచారంపై ట్రక్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరలు లీటరుకు 15 రూపాయల వరకు పెరిగితే రవాణా ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని, 30 శాతం వరకు ట్రక్కులు నిలిపివేయాల్సి వచ్చే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.
గత దశాబ్దాన్ని పరిశీలిస్తే.. 2013లో లీటర్ పెట్రోల్ ధర 72 రూపాయలు ఉండగా.. 2015-16 మధ్య 60 నుంచి 66 రూపాయలకు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ 2020 నాటికి 80 నుంచి 95 రూపాయలకు చేరింది. 2022-24 మధ్య 97 రూపాయల వరకు పెరిగిన ధరలు.. ప్రస్తుతం 100 రూపాయల దాటాయి. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారితే.. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎక్కడికి చేరతాయన్నది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.



.webp)


