పెద్ది సుదర్శన్ రెడ్డికి 9 సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన డాక్టర్ మమత..!

posted on: Jul 26, 2026 4:19PM

 

ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ప్రాణం పోసిన డాక్టర్ మమత.. ప్రశంసల వెల్లువ..!

తెలంగాణలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల ప్రాణాలను గుండెపోటు నుంచి కాపాడి వైద్య వృత్తికి గొప్ప నిదర్శనంగా నిలిచారు హనుమకొండ రోహిణి ఆసుపత్రికి చెందిన డాక్టర్ మమతారెడ్డి. తాజాగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురికాగా, సమయస్ఫూర్తితో స్పందించిన డాక్టర్ మమత తొమ్మిది సార్లు సీపీఆర్ నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడారు.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టువదలకుండా నిరంతరం సీపీఆర్ కొనసాగించి గుండె మళ్లీ స్పందించేలా చేయడంతో వైద్య వర్గాలు ఆమె సేవలను అభినందిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. డాక్టర్ మమత ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం, వృత్తిపట్ల నిబద్ధత అసాధారణమని కొనియాడారు. సకాలంలో సరైన చికిత్స అందించి ఒక ప్రజాప్రతినిధి ప్రాణాలను కాపాడడం నిజంగా "మెడికల్ మిరాకిల్" అని ఆయన పేర్కొన్నారు.

ఇది డాక్టర్ మమతకు ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇదే రోహిణి ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గుండెపోటుతో చేరగా, 11 సార్లు సీపీఆర్ నిర్వహించి ఆయన ప్రాణాలను కూడా కాపాడారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు అత్యవసర సమయంలో సీపీఆర్ ద్వారా ప్రాణదానం చేసిన వైద్యురాలిగా డాక్టర్ మమత ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ఘటనలతో రాజకీయ నాయకులు, వైద్యులు, ప్రజలు డాక్టర్ మమతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎంత కీలకమో ఈ సంఘటనలు మరోసారి చాటి చెప్పాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరికీ సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండటం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.

Peddi Sudarshan Reddy, Harish Rao, Dr Mamata CPR, BRS Leader Heart Attack

google-ad-img
    Related Sigment News
    • Loading...