పశ్చిమాసియాలో శాంతి తక్షణావసరం.. విదేశాంగ మంత్రి జైశంకర్

posted on: Apr 11, 2026 2:29PM

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని, అక్కడ తక్షణమే శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సదస్సులో పాల్గొనేందుకు మారిషస్ పర్యటనలో ఉన్న ఆయన, అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లపై మాట్లాడారు. యుద్ధ వాతావరణం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై భారత్ తన నిరసనను వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు.

ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడం పట్ల జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్న ఆయన.. దీనిని అడ్డుకోవడం   మంచిది కాదన్నారు. పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే దాడులను భారత్ ఎప్పుడూ ఖండిస్తుందని, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో భాగంగా జైశంకర్ కేవలం సదస్సుకే పరిమితం కాకుండా, వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నేపాల్, భూటాన్, సీషెల్స్ వంటి దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ అయి, ఆయా దేశాలతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ప్రాంతీయ భద్రత, సహకారంపై కీలక చర్చలు జరిపారు.

 అంతర్జాతీయ నౌకాయాన భద్రతపై జపాన్ విదేశాంగ మంత్రితో కూడా జైశంకర్ ఫోన్లో సంభాషించారు. హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో భద్రతా పరమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.  

ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడమే కాకుండా, సరఫరా గొలుసు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉద్రిక్తతలు సడిలేందుకు భారత్ చొరవ తీసుకుంటోందన్న సంకేతాలను ఇచ్చాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...